
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
మద్దూరు: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మద్దూరులో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం ప్రకారం.. కోయిలకొండ మండలంలోని దమ్మాయిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రయ్య(42) కొన్నేళ్లుగా మద్దూరులో వెంకటేశ్వర డయాగ్నోస్టిక్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొంతకాలం క్రితం కోస్గిలో నూతనంగా డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అయితే అక్కడ నష్టం రావడం, మద్దూరులో కూడా డయాగ్నోస్టిక్ సెంటర్ అంతంతగానే నడుస్తుండటంతో అప్పులు చేశాడు. తాను చేసినా అప్పులు ఎలా తీర్చాలో అని మనస్తాపం చెంది శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లోని బెడ్రూంలోకి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై రామచంద్రయ్య తమ్ముడు సత్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామచంద్రయ్యకు భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
భర్త దుర్మరణం
● భార్యకు గాయాలు
రాజాపూర్: బంధువుల వివాహానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో తన మోటార్ సైకిల్పై వెళ్తుండగా, వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతి చెంది, భార్యకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం రాజాపూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండలం మున్ననూర్ గ్రామానికి చెందిన కుర్వయాదయ్య(56), భార్య నారమ్మ, కుటుంబంతో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలు నవాబ్పేట మండలంలోని బంధువుల వివాహకార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్కు బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. రాజాపూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా బైక్ను వెనకనుంచి లారీ ఢీకొట్టింది. దీంతో యాదయ్య కుడిపైపు కింపడటంతో అతని మీద నుంచి లారీ టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య నారమ్మ ఎడమవైపుకు పడటంతో గాయాలతో బయటపడింది. తన కళ్లముందు కట్టుకున్న భర్త దుర్మరణం చెందడంతో ఆమె రోదనలు అక్కడున్న వారిని కలిచివేశాయి. విషయం తెలిసి వెంటనే రాజాపూర్ ఎస్ఐ శివానందంగౌడ్ అక్కడికి చేరుకున్నారు. నారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మతిస్థిమితం సరిగా లేక
మహిళ ఆత్మహత్య
మానవపాడు: మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మానవపాడులో చోటుచేసుకుంది. ఏఎస్ఐ ఆంజనేయులు కథనం ప్రకారం.. మానవపాడుకు చెందిన బోయ సుజాత(45), రాముడు దంపతులు వ్యవసా య పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే మద్యానికి బానిసైన సుజాత మానసిక స్థితి కోల్పోయింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై శుక్రవారం పెద్ద కూతురు పూజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. సుజాతకు భర్తతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
మిడ్జిల్: మద్యం మత్తులో పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం మండలంలోని బోయిన్పల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు కథనం మేరకు.. గ్రామానికి చెందిన కేశ యాదయ్య (52) కొంతకాలంగా మద్యానికి బానిసై పొలం పనులు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పురుగు మందు తాగి ఆలయ సమీపంలో ఉన్నాడని గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడు కేశ మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు.
చెరువులో పడి
మహిళ మృతి
హన్వాడ: మండలంలోని అమ్మాపూర్ గ్రామశివారులోని చెరువులో మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన కథనం మేరకు.. మండలంలోని మునిమోక్షం గ్రామానికి చెందిన బుడ్డభాగ్యమ్మ అమ్మాపూర్ శివారులో ఉన్న చెరువు దగ్గరకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లింది. ప్రమాద వశాత్తు చెరువులో పడి మృతి చెందింది. ఆమె కుమారుడు బుడ్డ కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు,