అంగన్వాడీల్లో కంటి పరీక్షలు
జడ్చర్ల టౌన్: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆర్బీఎస్కే బృందాలతో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,300 అంగన్వాడీ కేంద్రాలు.. 2,21,434 మంది చిన్నారులు ఉన్నారు. మొత్తం 26 ఆర్బీఎస్కే బృందాలతో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 7 బృందాలు ఏడుగురు ఆప్తాలమిస్టులతో ప్రతిరోజు శిబిరాలు కొనసాగుతుండగా.. మిగిలిన జిల్లాల్లో వైద్యుల కొరత కారణంగా రోజు విడిచి రోజు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 7న ప్రారంభమైన కంటి పరీక్షల నిర్వహణ జూన్ 10 నాటికి పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించారు. శిబిరాల్లో 6 నెలల చిన్నారి నుంచి ఆరేళ్ల విద్యార్థి వరకు కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు మేధో వైకల్యాలు, ఎదుగుదలలోని మైలురాళ్ల మూల్యాంకనం సైతం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదివిన విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లను పంపిణి చేశారు. ఆ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రభుత్వం అంగన్వాడీల్లోని చిన్నారులపై దృష్టిసారించింది.
సమగ్ర కంటి పరీక్షలు..
ముఖ్యంగా దృష్టి లోపం (దగ్గర, దూరం), మెల్ల కన్ను, కనురెప్పలు వాలిపోవడం, పై కనురెప్పల పొక్కులు, నిష్టగమస్–కనుగుడ్ల అనియంత్రణ, జన్మతా కంటి శుక్లాలను గుర్తిస్తున్నారు. లోపాలను గుర్తించి వారిని ప్రత్యేక చికిత్సల కోసం డీఈఐసీ, మహబూబ్నగర్ జీజీహెచ్కు రెఫర్ చేస్తున్నారు.
మేధో వైకల్యాలు..
కంటి పరీక్షలతో పాటు పిల్లల్లో మైలురాయి మూల్యాంకనం, మేధో వైకల్యాలు సైతం గుర్తిస్తున్నారు. ఇందుకోసం 42 ప్రశ్నలతో రూపొందించిన ఓ జాబితా రూపొందించి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి శారీరక, మానసిక వైకల్యాలు గుర్తిస్తున్నారు. అలా గుర్తించిన వారికి మెరుగైన చికిత్స కోసం డీఈఐసీకి రెఫర్ చేయనున్నారు.
జిల్లాలో 56,854 మంది చిన్నారులకు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 1,163 అంగన్వాడీ కేంద్రాల్లోని 56,854 మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేస్తున్నాం. 6 నెలల పసికందు నుంచి ఆరేళ్ల చిన్నారి వరకు అందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశాం. వీటితోపాటు మేధోవైకల్య పరీక్షలు చేసి చిన్నారుల ఆరోగ్య వివరాలన్నీ తెలుపడంతో వారి జీవితానికి భరోసా కలుగుతుంది.
– డా.కృష్ణ, డీఎంహెచ్ఓ, మహబూబ్నగర్
జూన్ 10 నాటికి పూర్తిచేస్తాం..
6 నెలల చిన్నారి నుంచి ఆరేళ్ల బాలల వరకు కంటి పరీక్షలు చేస్తున్నాం. దీంతోపాటు మానసిక వైకల్యం, మేధోవైకల్యం నిర్ధారణ జరుపుతున్నాం. జడ్చర్ల, మిడ్జిల్ ఆర్బీఎస్కే పరిధిలో జూన్ 10 నాటికి పరీక్షలు పూర్తిచేస్తాం.
– డా. సునీల్, ఆర్బీఎస్కే వైద్యుడు, జడ్చర్ల
ఆర్బీఎస్కే బృందాలతో నిర్వహణ
ఉమ్మడి జిల్లాలో 2,21,434 మందిచిన్నారులు
జూన్ 10 నాటికి పూర్తిచేసేలా ప్రణాళికలు
అంగన్వాడీల్లో కంటి పరీక్షలు


