
రోడ్ షోలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు
నారాయణపేట/ మక్తల్: ‘పేద కుటుంబం నుంచి వచ్చిన వాకిటి శ్రీహరిపై వేలాదిగా తరలివచ్చిన జనాభిమానాన్ని చూస్తుంటే మక్తల్లో ఆయన గెలిచినట్లే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమ’ని కర్ణాటక సీఎం సిద్ద రాయయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మక్తల్ రోడ్షోలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు దొంగలేనని.. తెలంగాణలో కొనసాగుతున్న దొరలు, దొంగల పాలనను ప్రజలందరూ కలిసి సాగనంపాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు గడిచినా చేసిందేమి లేదని.. రాష్ట్రాన్ని దివాళా తీయించారన్నారు. కేసీఆర్ హయాంలో ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, కానీ, ఇక్కడ స్వార్థ ప్రయోజనాల కోసం తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్– 11న శక్తి యోజన పథకం ప్రారంభించి రూ.10 కోట్లతో మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. సీఎం కేసీఆర్ జిమ్మికులను ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని విశ్వసిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత విద్యుత్ అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తుందని.. బీజేపీ సైతం అదేబాటలో పనిచేస్తుందన్నారు. అంతకు ముందు కుర్వలు సీఎం సిద్దరామయ్యను గొంగడితో సన్మానించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
జనం చూస్తుంటే శ్రీహరి గెలిచినట్లే..
మక్తల్ రోడ్షోలో
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

మక్తల్ రోడ్ షోలో మాట్లాడుతున్న సీఎం సిద్ధరామయ్య