కురవి: తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కురవి భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు పోటెత్తుతారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇలాంటి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో కేసీఆర్ రూ.5కోట్ల నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో మొత్తం పనులు పూర్తికాలేదు. ఆ నిధులతో చేపట్టాల్సిన కొన్ని పనులు నేటికీ మొదలు కాలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఆలయ అభివృద్ధికి నయాపైసా విడుదల చేయలేదు. కొంత మంది భక్తులు లక్షలాది నిధులు వెచ్చించి సొంతంగా కొంత మేర అభివృద్ధి చేశారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం వీరభద్రుడికి ఆదరణ కరువైంది.
ముందుకు సాగని మాస్టర్ ప్లాన్.!
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయ పాలక మండలిని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ఆలయ ఈఓ సత్యనారాయణ ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. రూ.50 కోట్లతో ప్లాన్ తయారు చేసి సిద్ధం చేశారు. భక్తుల సాయంతో పనులు చేసేందుకు సిద్ధమైన తరుణంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం ఆలయానికి పాలక మండలిని ఏర్పాటు చేయడంతో చైర్మన్గా కొర్ను రవీందర్రెడ్డిని ఎంపిక చేశారు. చైర్మన్తో పాటు సభ్యులు ఆ మాస్టర్ ప్లాన్ను తీసుకుని డోర్నకల్ ఎమ్మెల్యే, విప్ జాటోత్ రాంచంద్రునాయక్ సహకారంతో ఈ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి వద్దకు వెళ్లారు. ప్లాన్ను ఆయన సీఎం రేవంత్రెడ్డికి చూపించి ఆలయ అభివృద్ధికి నిధులు వచ్చేలా చేస్తానని పాలకమండలికి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ నిధులు ఎప్పుడు వస్తాయోనని భక్తులు ఎదురుచూస్తున్నారు.


