కురవి: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలోని ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను ఆమె పరిశీలించి అధికారులతో మాట్లాడారు. స్కూల్కు రూ.200కోట్లు కేటాయించారని, నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగాయంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పనులను ప్రారంభించిందని తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో రెసిడెన్షియల్ విద్య అందిస్తారని తెలిపారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి చొప్పున స్కూల్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు బోధన ఉంటుందన్నారు. ప్రతీ పాఠశాలలో 2,500 మంది విద్యార్థులకు వసతి, విద్య అందించేలా రూపకల్పన, అధునాతన తరగతి గదులు, సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, గ్రంథాయం, క్రీడా మైదానాలు, హాస్టల్, భోజనశాల వంటి సదుపాయాలు ఉంటాయని వివరించారు. మొదటి దశలో బాలికల పాఠశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈడబ్ల్యూసీ ఇంజనీర్ అరుణ్కుమార్, కురవి తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
గూడూరు: ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మండలంలోని బొద్దుగొండ, ఎర్రకుంటతండా సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ బాధ్యులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా, నాణ్యమైన సిమెంట్, ఐరన్, కలప వస్తువులను ఉపయోగించాలన్నారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్ఛరించారు. కార్యక్రమంలో ఈడబ్ల్యూసీ ఇంజనీర్ అరుణ్కుమార్, డీటీ కోమల పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్
డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి
మహబూబాబాద్: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం ఎస్ఐఆర్పై సంబంధిత అఽధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. అమూల్యమైన ఓటు హక్కును కాపాడుకునేలా ఓటర్లను చైతన్యం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నితీష్కుమార్ పాల్గొన్నారు.


