మహబూబాబాద్ రూరల్ : రైతులు నీటి వసతి ఆధారంగా పంటలు వేసుకోవాలని, ఆయిల్ పామ్ పంటను సాగు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నిర్వహించిన 100వ రైతు నేస్తం కార్యక్రమాన్ని మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదిక కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ ద్వారా రైతులు, వ్యవసాయ అధికారులు మంగళవారం వీక్షించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గుతుందని, వరికి బదులు ఆరుతడి పంటలైన వేరుశనగ, పెసర, మినుములు, కూరగాయలు సాగు చేయాలని కోరారు. జిల్లాలోని జయ్యారం గ్రామంలో ఆయిల్ పామ్ పంట సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్న రైతు వల్లూరి కృష్ణారెడ్డి ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత ఉత్తమ రైతులు, ఏఈఓలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.విజయచంద్ర, జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ టెక్నికల్ రాంజీ, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు


