సంగెం : వరంగల్ జిల్లా సంగెం మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా చోరీకి గురవుతున్న విద్యుత్ మోటార్ల కేసులను సంగెం పోలీసులు చేధించినట్లు పర్వతగిరి సీఐ రాజగోపాల్ తెలిపారు. సంగెం పోలీస్స్టేషన్లో మంగళవారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో ఈ నెల 22వ తేదీ రాత్రి ముగ్గురి ఇళ్లల్లో సంపుల్లోని మూడు విద్యుత్ మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిచారని బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వంశీకృష్ణ కేసు దర్యాప్తులో భాగంగా రామచంద్రాపురంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడి కదలికలను స్పష్టంగా గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, సమాచార సేకరణ, నిఘాతో నిందితుడిని గుర్తించారు. ఈక్రమంలో మండలంలోని కాపులకనిపర్తి గ్రామంలో మంగళవారం వాహనాల తనిఖీ చేస్తుండగా రెండు మోటార్లను తీసుకుని సైకిల్పై వెళ్తున్న జనగామ జిల్లా జఫర్గడ్ మండలం గరిమిళ్లపల్లి గ్రామానికి చెందిన పిడుగు యాదగిరిని అదుపులోకి తీసుకుని విచారించగా సంగెం మండలంలోని రామచంద్రాపురంలో 3, కాట్రపల్లిలో 3, సంగెం ప్రభుత్వ ఆస్పత్రిలో 2, గాంధీనగర్లో 1, ఆశాలపల్లిలో ఒకటితోపాటు హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నెలులో 2, సింగారంలో 5 మోటార్లను వరుసగా చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడి ఇంటి నుంచి మరో 15 మోటార్లు మొత్తం 17 మోటార్లను స్వాధీనం చేసుకుని నిందితుడు యాదగిరిని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ రాజగోపాల్ మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని నేరం జరిగినపుడు వెంటనే నిందితులను పట్టుకోవడానికి దోహదం చేస్తాయన్నారు.
నిందితుడి అరెస్టు, మోటార్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన పర్వతగిరి సీఐ రాజగోపాల్


