గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఏడుగురు యువకులు
ముగ్గురు బీటెక్.. ఇద్దరు డిగ్రీ
డోర్నకల్: జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ముల్కలపల్లి సమీపంలో విక్రయించేందుకు యత్నించిన ఏడుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి కథనం ప్రకారం.. గంజాయి రవాణాపై విశ్వనీయ సమాచారం మేరకు ఆదివారం ఎస్సై రియాజ్పాషా, సిబ్బంది ముల్కలపల్లి సమీపంలో నిఘా పెట్టారు. ఈ సమయంలో మూడు బైక్లపై కొంతమంది యువకులు వచ్చి పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. దీంతో సిబ్బంది ఏడుగురు యువకులను పట్టుకోగా ఒకరు పరారయ్యారు. అనంతరం విచారించి ఖమ్మం జిల్లా వేంసూరుకు చెందిన మారకల శ్యాంప్రేమ్ కృష్ణ, ముల్కలపల్లికి చెందిన బానోత్ ఉదయకిరణ్, బండారి వరప్రశాంత్, ఖమ్మానికి చెందిన చాపల సాయిశశికుమార్, గోరంట్ల చక్రవర్తిమణిరాజ్, తొడేళ్లగూడేనికి చెందిన షేక్ అబ్బాస్(ఆటోడ్రైవర్ ), తంగెళ్ల మహేశ్(భవన నిర్మాణ కార్మికుడు)గా గుర్తించారు. ముల్కలపల్లికి చెందిన బండారి సంతోశ్ పరారయ్యాడు. షేక్ అబ్బాస్, మహేశ్ మినహా మిగతా వారంతా గతంలో ఒడిశాలో గంజాయి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 22న శ్యాంప్రేమ్ కృష్ణ, బానోత్ ఉదయకిరణ్, వరప్రశాంత్, సాయిశశికుమార్, చక్రవర్తిమణిరాజ్ ఒడిశాలో 7.525 కేజీల గంజాయి కొనుగోలు చేసి మూడు బ్యాగుల్లో 24వ తేదీన ముల్కలపల్లి పాండవుల గుట్ట వద్ద విక్రయించడానికి తీసుకొస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో నిందితుల నుంచి మూడు బైక్లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని మహబూబాబాద్ కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ సోమవారం తెలిపారు. ఎస్సైలు రియాజ్పాషా, ఝాన్సీ, సిబ్బంది పాల్గొన్నారు.
వివరాలు వెల్లడించిన
డోర్నకల్ పోలీసులు
గంజాయి తరలిస్తూ పట్టుబడిన వారిలో ముగ్గురు బీటెక్, ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు. మరొకరు డిగ్రీ పూర్తి చేసి కూలి పనులు చేస్తున్నాడు. నిందితుల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద తమ వారిని చూసి కంటతడి పెట్టారు.


