● అమాంతం పెరిగిన
నిత్యావసర వస్తువుల ధరలు
● బియ్యం రేట్లకు రెక్కలు
● పేదలపై ఆర్థిక భారం
మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్ : నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్తో పాటు కోడిగుడ్లు, మాంసం, చికెన్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు, పేదలపై ఆర్థికభారం పడుతోంది. ప్రభుత్వం ధరల కట్టడిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
మాంసం మరింత..
రెండు నెలల నుంచి కోడిగుడ్డు ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కేసు కోడిగుడ్ల ధర రూ. 240కి చేరింది. దీంతో ఒక్క గుడ్డు రూ.8కి విక్రయిస్తున్నారు. వేసవిలో ఎండ తీవ్రతకు కోళ్లు ఎక్కువ మృతి చెందడంతో ఉత్పత్తి తగ్గి గుడ్డు డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఎప్పుడు కూడా కేసు ధర రూ. 240కి చేరలేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా మాంసం కేజీ రూ.1,000, బోన్లెస్ అయితే రూ.1,200, గొర్రె లేదా మేక తలతో పాటు నాలుగు కాళ్లకు రూ.1,500 వరకు తీసుకుంటున్నారు. చికెన్ ధర కూడా విపరీతంగా పెంచారు.
గ్యాస్ ధరల దడ..
జిల్లాలో పలు కంపెనీలకు చెందిన 2,11,531 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి 7న గ్యాస్ సిలిండర్ ధర రూ.60పెరిగింది. అప్పటి వరకు గ్యాస్ సిలిండర్ ధర రూ.924 ఉండగా రూ.60 పెరగడంతో రూ.984కి చేరింది. అలాగే జూన్లో మళ్లీ రూ 29 పెంచారు. దీంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1,013కి చేరింది. కానీ డెలివరీతో కలిపి రూ.1,030 తీసుకుంటున్నారు.
బియ్యం ధరలు..
బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయి. జై శ్రీరాం రకం బియ్యం క్వింటా రూ.7.000, ఆర్ఎన్ఆర్ రూ.6000, సాంబమసూరి రూ. 5,500 విక్రయిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఈ సారి వర్షాలు లేక సాగు కష్టంగానే ఉంది. వరి సాగు లేకపోతే బియ్యం ధరలు విపరీతంగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.


