పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండల పరిధి బమ్మెర గ్రామంలో కాకతీయుల కాలానికి చెందిన ‘గుండా బ్రహ్మయ్య శూలాల శిల్పం’ వెలుగులోకి రావడం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. పాలకుర్తి మండల కేంద్రంలోని సోమన స్మారక మందిరంలోనూ ఇదే తరహా మరో శిల్పాన్ని గుర్తించినట్లు మట్టి ఫౌండేషన్ పరిశోధకులు వెల్లడించారు. ప్రసిద్ధ వాగ్గేయకారుడు బమ్మెర పోతన జన్మస్థలం బమ్మెరలోని పోతన మాన్యం భూముల్లో ఉన్న స్మారక మందిరం ప్రాంగణంలో మట్టిలో కూరుకుపోయిన కాకతీయుల కాలం నాటి శూలాల శిల్పాన్ని ‘డిస్కవరీ మ్యాన్’ రెడ్డి రత్నాకర్రెడ్డి ఆధ్వర్యంలో మట్టి ఫౌండేషన్ బృందం వెలికితీసింది. ఫౌండేషన్ ప్రతినిధులు వినయ్ గోలి, ఆఖిల్, సముద్రాల రాజు,డాక్టర్ రాపోలు సత్యనారాయణ తదితరులు ఈ శిల్పాన్ని పర్యాటకుల సందర్శనార్థం నిలబెట్టారు. సుమారు నాలుగు అడుగుల ఎత్తైన ఈ శిల్పపై రెండు శూలాలు చెక్కి ఉండడం విశేషం, ఇవి వీరవైశ సంప్రదాయంలో గుండా బ్రహ్మయ్యల త్యాగానికి ప్రతీకలని పరిశోధకులు తెలిపారు. ఇదే తరహా శిల్పం వరంగల్ జిల్లా గవిచర్లలోని గూండా బ్రహ్మయ్య ఆలయంలో పూజలందుకుంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా పాలకుర్తి సోమన స్మారక మందిరంలో ధ్వజస్తంభం గద్దె వద్ద ఉన్న శిల్పం కూడా గూండా బ్రహ్మయ్యదేనని గుర్తించారు.
పాలకుర్తి సోమన్న స్మారక మందిరంలో మరో శిల్పం గుర్తింపు
‘మట్టి ఫౌండేషన్’ పరిశోధనలో అరుదైన ఆధారాలు


