● విద్యుదాఘాతంతో కొడుకు మృతి
● రూపిరెడ్డిపల్లిలో ఘటన
రేగొండ: తండ్రి చనిపోయిన మూడో రోజే కొడుకు మృతి చెందాడు. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కనుకుంట్ల సమ్మయ్య అనారోగ్యంతో ఈ నెల 26వ తేదీన చనిపోయాడు. గురువారం మూడో రోజు కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కుమారుడు గోపి (46) విద్యుత్ మోటార్ ఆన్ చేసి నీళ్లు పడుతుండగా, పక్కన ఉన్న రేకులకు చేయి తగిలింది. అప్పటికే పేలి ఉన్న విద్యుత్ తీగ రేకులకు తగిలి ఉండడంతో షాక్కు గురయ్యాడు. దీంతో అతడిని రక్షించేందుకు వెళ్లిన అక్కకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా గోపి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.


