● రాష్ట్ర అటవీ, పర్యావరణ,
దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
ఖిలా వరంగల్: ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బక్రీద్ సందర్భంగా గురువారం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఖిలావరంగల్ పెట్రోల్ బంక్ జంక్షన్లోని ఈద్గా మైదానంలో బక్రీద్ నిర్వహణ కమిటీ ప్రతినిధి ఎంఏ ఖలీక్ తన్వీర్ (ముతవల్లి) ఆధ్వర్యంలో ఈద్గా మత గురువు మౌలానా మహ్మద్ నౌమన్ రాజా నేతృత్వంలో వక్ఫ్ సీఈఓ మహమ్మద్ హస్సదుల్లా, బల్దియా అధికారుల సహకారంతో 30వేల మంది ముస్లింలు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. చౌర్బౌలి, ఎల్బీనగర్, శివనగర్, రంగశాయిపేట, శంభునిపేట, శాంతినగర్, ఏకశిల నగర్, కరీమాబాద్, చింతల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చేరుకున్న ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం అలయ్ బలయ్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు హాజరై ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావును ఈద్గా అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు ఎంఏ జబ్బార్ శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గోపాల నవీన్ రాజు, మీసాల ప్రకాశ్, ఎంఏ జబ్బార్, బాసాని శ్రీనివాస్, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


