ముందుగా రుణాలు ఇవ్వాలి
తొర్రూరు రూరల్: నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మించి, వారి సొంతింటి కలలను నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం నత్తనడకన కొనసాగుతోంది. మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు 10నుంచి 30 ఇళ్ల చొప్పున మొత్తం 607 ఇందిరమ్మ ఇళ్లను నిరుపేద లబ్ధిదారులకు మంజూరు చేశారు. అందులో 583 ఇళ్ల నిర్మాణాలకు సంబంధిత అధికారులు పర్మిషన్ ఇవ్వగా, అందులో 314 ఇళ్లు స్లాబ్ లెవల్, 50 సజ్జల లెవల్, 100 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో ఉండగా, మరో 84 ఇళ్ల నిర్మాణాల పనులను అసలే ప్రారంభించలేదు. గత ఏడాది కాలంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయే తప్పా ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుడు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం చేసిన దాఖలాలు లేవు.
ఆర్ధికభారంతో ఆసక్తి చూపాని లబ్ధిదారులు..
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునేందుకు ఆర్ధికభారం పడుతుండడంతో నిరుపేద లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ప్రతి ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తుండగా, బెసిమెంట్ లెవల్ నిర్మిస్తే రూ.లక్ష, సజ్జెల లెవల్ రెండోవ విడత రూ.లక్ష, స్లాబ్ లెవల్ మూడో విడత రూ. లక్ష, స్లాబ్ పూర్తి చేసిన తర్వాత నాల్గో విడత రూ.లక్ష, ధర్వాజలు పెట్టి, పెయింటింగ్ వేసిన తర్వాత ఐదో విడత రూ.లక్ష చొప్పున మొత్తం రూ.5లక్షలు ఇస్తున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులే ముందుగా పెట్టుబడి పెట్టి ఇళ్లు నిర్మించుకోవల్సిన పరిస్థితి ఉండడంతో అప్పులు తేలేక, ఇతర రుణాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. తద్వారా మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి.
ఆసక్తి చూపని లబ్ధిదారులు
ప్రారంభం కాని 84ఇళ్ల
నిర్మాణ పనులు
బ్యాంక్ రుణాలు ఇవ్వాలని విన్నపం
ప్రభుత్వం నుంచి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగానే ముందుగానే బ్యాంక్ రుణాలు ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే బిల్లులు ఇవ్వడం ద్వారా అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకునేందుకు నిరుపేదలు ముందుకు రావడం లేదు. అందుకే రుణాలు ఇప్పించి ఇళ్లను మంజూరు చేస్తే నిర్మాణ పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
– బొల్లం అశోక్, కార్మిక సంఘం నాయకుడు


