● వీసీలో సీఎం రేవంత్రెడ్డి
మహబూబాబాద్: ధాన్యం, మక్కల కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి.. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, లక్ష్మణ్కుమార్, కృష్ణారావు, శ్రీహరి, సీతక్క, ఎంపీ వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్ళి రామకృష్ణారావుతో కలసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోళ్ల పురోగతిపై సమీక్షించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ధాన్యం, మక్కల కొనుగోలులో వేగం పెంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలన్నారు. అవసమైన లారీలు అందుబాటులో ఉంచాలన్నారు. వాహనాలు సమకూర్చని కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాత్కాలిక నిల్వ కేంద్రాలను వినియోగించాలన్నారు. మొక్కజొన్న పంట అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జాప్యం లేకుండా చూడాలి : కలెక్టర్
కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ స్నేహ శబరీష్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. గన్నీ బ్యాగులు ఇతర అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్ ఉన్నారు.


