● కలెక్టర్ స్నేహ శబరీష్
మహబూబాబాద్ అర్బన్: వేసవి శిక్షణ శిబిరాల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించి మాట్లాడారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలను ఈనెల 17వరకు నిర్వహించాలన్నారు. విద్యార్థులు క్రీడ, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలని అన్నారు. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్ఎం ఆరుద్ర వెంకటేశ్వర్లు, అధికారులు శ్రీరాములు, అప్పారావు, సంతోష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో పని చేయాలి..
మహబూబాబాద్: అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం సంబంధిత అధికారులతో ధాన్యం, మక్కల కొనుగోళ్లు తదితర విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు, రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ అనిల్కుమార్ పాల్గొన్నారు.


