● ఎల్బీజీ నగర్ కాలనీలో ఘటన
మహబూబాబాద్ రూరల్ : ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ ఎల్బీజీ నగర్ కాలనీలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టౌన్ ఎస్సై ఉమ కథనం ప్రకారం.. కాలనీకి చెందిన ఆరుముళ్ల ఉమ, నర్సయ్య దంపతులకు కుమారుడు రాజు (20), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాల క్రితం నర్సయ్య మృతి చెందగా ఒక కుమార్తె వివాహం జరిగాక ఆ కుటుంబం హైదరాబాద్ వెళ్లి కూలీ చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో రాజు తన బైక్ లైసెన్స్ తీసుకొస్తానని తల్లికి చెప్పి శనివారం మహబూబాబాద్ వచ్చాడు. రాత్రి తన మిత్రులతో కలిసి వారి ఇంటిలోనే నిద్రించాడు. ఉదయం మళ్లీ మిత్రులు ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వారు వచ్చి చూడగా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. కాగా, రాజుకు ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగగా కొంతకాలం క్రితం ఆ అమ్మాయి సంబంధీకులు అతడిని బెదిరించినట్లు తెలిసింది. మళ్లీ అదే విధంగా బెదిరింపులు వస్తే భయపడి ఉరేసుకున్నాడా? లేక ఏ కారణంతో ఉరేసుకున్నాడో తెలియరాలేదు. మృతుడి తల్లి ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


