తొర్రూరు: తొర్రూరు పట్టణ ప్రజలకు తాగునీరు సరిపడా అందడం లేదు. నాలుగైదు రోజులకోసారి వదలడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో తాగునీటి సరఫరా ఆందోళనకరంగా మారింది. గత నెల మొదటి వారంలో కనీసం మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా చేసేవారు. ఆ తర్వాత పంపింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ సమస్య, పైప్లైన్ లీకేజీలు, ధ్వంసం అంటూ మూడు నుంచి నాలుగు రోజులకోసారి తాగునీరు అందిస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.
తప్పని నీటి కష్టాలు..
తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. స్థానిక జనాభాకు తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిపోయేవారు, ఇక్కడే ఉద్యోగం, విద్యాభ్యాసం రీత్యా ఉండేవారితో కలిపి పట్టణ జనాభా 35 వేలకు పైగా ఉంది. జనాభాలో ఒక్కొక్కరికీ సగటున రోజుకు 135 లీటర్ల నీరు అందించాలన్నది లక్ష్యం. ఈ మేరకు రోజుకు 4.72 లక్షల లీటర్ల నీరు అవసరం. కానీ 2 లక్షల లీటర్ల వరకు మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది. మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీరు అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో అందడం లేదు. వేసవి తీవ్రత దృష్ట్యా నీటి అవసరాలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని నాగేశ్వరరావు కాలనీ, రిక్షా కాలనీ, దుబ్బతండా, ఎర్రసోమ్లాతండా తదితర ప్రాంతాల్లో నీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ నీరు సక్రమంగా రాకపోవడంతో వ్యవసాయ బావుల దగ్గర నుండి, చేతిపంపుల ద్వారా నీరు తెచ్చుకుంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు.
చేతిపంపుల నుంచి
నీరు తెచ్చుకుంటున్నాం
మూడు రోజులకోమారు మిషన్ భగీరథ నీరు ఇస్తున్నారు. దీంతో నీరు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంచినీళ్ల కోసం అవస్థలు పడుతున్నాం. సమీపంలోని బాలవికాస సంస్థ చేతిపంపు నుండి నీరు తెచ్చుకుని వాడుకుంటున్నాం. నీటి కొరతతో పొదుపుగా నీరు వాడుకుంటున్నాం. అధికారులు ప్రతీరోజు నీరు సరఫరా చేస్తే అవసరాలు తీరుతాయి.
– ఇరుగు చామంతి,
రిక్షా కాలనీ, తొర్రూరు
●
తొర్రూరులోని రిక్షా కాలనీలో చేతిపంపు ద్వారా నీటిని తీసుకెళ్తున్న మహిళలు


