స్టేషన్ఘన్పూర్ : వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికి చెందిన రైతు గాండ్ల రవి (46) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవి తనకున్న వ్యవసాయ భూమిలో పండించిన ధాన్యాన్ని ఇటీవల శివునిపల్లిలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోశాడు. శుక్రవారం భార్యతో కలిసి ధాన్యం తూర్పార పట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండుటెండలో పనిచేసిన రైతు మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకోగా గమనించిన అతడి భార్య చుట్టుపక్కల వారి సాయంతో బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రవికి భార్య జ్యోతి, కుమార్తె రసజ్ఞ, కుమారుడు రాజేష్ ఉన్నారు. రైతు మృతిపట్ల శివునిపల్లి మున్నూరుకాపు సంఘం నాయకులు, రైతులు తోట వెంకటేశ్వర్లు, తోట భిక్షపతి, పోశాల క్రిష్ణమూర్తి, తోట సోమయ్య, గాండ్ల రాజు తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు.


