తొర్రూరు: తొర్రూరు ఆర్టీసీ డీఎంను దూషించిన ఘటనలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించా రు. వివరాలిలా ఉన్నాయి.. ములుగు జిల్లా తాడ్వాయికి చెందిన సంతోష్ గురువారం వ్యక్తిగత పనిపై తొర్రూరు బస్టాండ్కు వచ్చి వరంగల్ వైపు వెళ్లే బస్సు ఎక్కాడు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ ఫోన్ మాట్లాడుతున్నాడని తొర్రూరు డిపో మేనేజర్ పద్మావతికి ఫోన్ చేసి దుర్భాషలాడాడు. మహిళ అని చూడకుండా ఇష్టానురీతిన దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎం గురువారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో ఎస్సై ఉపేందర్.. ప్రయాణికుడు సంతోష్కు ఫోన్ చేసి నీపై కేసు నమోదైందని తెలపగా అతడు ఎస్సైపై చిర్రుబుర్రులాడాడు. తనపైనే కేసు పెడతారా.. అంటూ ఊగిపోయిన సదరు వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా ఎస్సై.. డీఎం దగ్గర రూ.20 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇది జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైనట్లు సమాచారం.
ఏసీబీకి పట్టుబడ్డాడంటూ ఎస్సైపై సోషల్ మీడియాలో వైరల్
డీఎంను దూషించిన వ్యక్తే
నిందితుడిగా పోలీసుల గుర్తింపు


