న్యూస్రీల్
ఈ ఫొటోలోని రైతు తొర్రూరు మండలం అమ్మపురం గ్రామానికి చెందిన దొనక ఉప్పలయ్య. తన పొలంలో పండిన 200 బస్తాల ధాన్యం 25రోజుల క్రితం గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. పదిరోజుల తర్వాత కాంటాలు పెట్టారు. కాంటాలు పెట్టి 15రోజులు గడిచినా.. ధాన్యం తీసుకెళ్లడం లేదు. మిల్లర్లు దించుకోకపోవడంతో లారీలు రావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. కాంటాలు పెట్టిన ఐదారు రోజులకు మళ్లీ తూకం తగ్గుతుందని, తిరిగి కాంటాలు పెడితేనే ధాన్యం తీసుకెళ్తామని అధికారులు అంటున్నారు. ఈ పరిస్థితిలో రోజూ గాలీ వానకు భయపడి బస్తాలు, టార్పాలిన్లు కప్పడం, కాపలా ఉండటంతో ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి మహబూబాబాద్ మండలం ముడుపుగల్లు గ్రామానికి చెందిన చంద్రశేఖర్. ఇతనికి ఐదు ఎకరాల్లో పండిన 20 పుట్ల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చారు. కొంతకాలం తేమశాతం ఎక్కువగా ఉందని ఆపారు. తేమశాతం వచ్చిన తర్వాత దొడ్డురకం మిల్లర్లు వద్దంటున్నారని లారీలు రావడం లేదని, ఇప్పటి వరకు ధాన్యం కాంటాలు పెట్టడం లేదు. ఇప్పటికే రెండుసార్లు వర్షానికి ధాన్యం తడిసింది. తొందరగా ధాన్యం కొనుగోలు చేస్తే బాధలు తీరుతాయని వాపోతున్నాడు.


