● ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు
మహబూబాబాద్: వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు విజయవంతమైందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మానుకోట జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించిందన్నారు. సభకు పోటీగా ఆర్ట్స్ కాలేజీలో రైతు మేళా చేపట్టి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా రైతులు హాజరు కాక మేళా వెల వెలబోయిందన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేశారన్నారు. రాజకీయాలు పక్కకు పెట్టి మేడిగడ్డ మరమ్మతు చేసి సాగు నీరు అందించాలన్నారు. భూ గర్భజలాలు అడుగంటాయని ఇదే పరిస్థితి నెలకొంటే తాగు నీటి సమస్య ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. నేటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. సభ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్తో సహ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. దమ్ముంటే కల్లాల దగ్గరికి వచ్చి మాట్లాడాలన్నారు. పదజాలం మార్చు కోకుంటే ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. నాయకులు వెంకన్న, వెంకన్న, రఘు, అజయ్, అంజరీష్ తదితరులు పాల్గొన్నారు.


