మహబూబాబాద్ రూరల్ : సోలార్ ద్వారా విద్యుత్ వినియోగంపై ప్రతీ ఒక్కరు దృష్టిసారిస్తే ఆర్థికంగా లాభం చేకూరుతుందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలను పురస్కరించుకుని మానుకోట రైతు వేదికలో వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు అంశంపై గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రాన్స్ ఫార్మర్లు కాలకుండా, మోటార్లు పేలకుండా ఉంటున్నాయంటే రూ.1.35 లక్షల కోట్లు ఖర్చుపెడితేనే ఇంతగా కరెంటు సేవలు ఇవ్వగలుగుతున్నారన్నారు. పీఎం కుసుం ద్వారా రైతులకు సూర్య శక్తితో ఆదాయం సమకూరుతుందన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సౌర విద్యుత్ పై అపోహలు తొలగించి అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. కొంతమంది ఏఈఓ రైతు వేదికల వద్ద రైతులకు అందుబాటులో ఉండడం లేదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి, ప్రజా పాలన రాష్ట్ర పరిశీలకుడు వెంకన్న, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయేందర్ రెడ్డి, డీఏఓ సరిత, జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి మరియన్న, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ, విద్యుత్ శాఖ డీఈలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవం


