శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల సదాశివుడు(70) చేనేత వృత్తి చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో సదాశివుడు బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు. కాసేపటికీ ఎంత పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక నోరు ఆరిపోవడంతో వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. సదాశివుని మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిరుపేద అయిన సదాశివుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


