కాళోజీ సెంటర్ : వరంగల్ జిల్లా సంక్షేమ శాఖలో బుధవారం రెండో రోజూ ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. డీడబ్ల్యూఓ రాజమణి ఇంటికెళ్లి తనిఖీ చేశారు. మధ్యాహ్నం వరకు తనిఖీలు చేసి రాజమణితోపాటు సీనియర్ అసిస్టెంట్ కుమార్ను ఏసీబీ కార్యాలయానికి పిలుపించుకొని కావాల్సిన ఫైళ్లకు సంబంధించిన జిరాక్స్ కాపీలను తీసుకున్నట్లు సమాచారం. వివిధ పథకాల అమలుకు సంబంధించి అధికారుల పనితీరుపై ఆరా తీసినట్లు తెలిసింది. 2023 నుంచి సుమారు రూ.కోటి 16 లక్షల నిధులను ఖర్చు చేయడంలో డీడబ్ల్యూఓ నిర్లక్ష్యాన్ని గుర్తించినట్లు సమాచారం. బేటీ బచావో –బేటీ పడావో స్కీమ్ అమలు కోసం 2023–24 సంవత్సరానికి రూ.30 లక్షలు, 2024– 25 సంవత్సరానికి రూ.30 లక్షల నిధులు మంజూరు కాగా నిధులను నామమాత్రంగా ఖర్చుపెట్టినట్లు రికార్డులను గుర్తించారని తెలిసింది. ఈఆర్ఎస్ స్కీమ్(వికలాంగులు, ట్రాన్జెండర్స్ రుణాల మంజూరీ) విషయంలో దరఖాస్తులకే పరిమితం చేసి లబ్ధిదారుల ఎంపిక, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయకపోవడంతో నిధులు నిల్వ ఉన్నట్లు తెలిసింది. డ్రక్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించకుండా రూ.లక్ష 50వేలు పెండింగ్లోనే ఉంచినట్లు సమాచారం. 2016 సంవత్సరం నుంచి దాల్ టెండర్ల ఈఎండీల (కాంట్రాక్టర్ డిపాజిట్) చెల్లింపు జరగలేదని, డే కేర్ సెంటర్ నిర్వహణకు నిధులు కేటాయిస్తే ఇప్పటి వరకు డే కేర్ సెంటర్ ప్రారంభించలేదని తేలింది. ఉద్యోగ నియామకాలు, ఔట్ స్సోర్సింగ్ ఏజెన్సీల ఎంపికలో కూడా ఏకపక్షంగా డీడబ్ల్యూఓ నిర్ణయం తీసుకొని అప్పగించారని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అంగన్వాడీ కేంద్రాల ఆధునికీకరణ పనుల విషయంలో థర్ట్పార్టీ కాంట్రాక్టర్కు కట్టబెట్టగా ఒక్క వర్కునే మూడు దిక్కుల చేసినట్లు ఒక్క ఫొటోనే పెట్టి బిల్లుల తీసుకునే ప్రయత్నం చేసినట్లు తేలింది. ఈ విషయంలో డీడబ్ల్యూఓ సంబంధిత కాంట్రాక్టర్తో ఆర్థిక పరమైన బేరాలు, సంబంధిత కాంట్రాక్టర్లతో వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడుకున్నట్లు తెలిసింది.
రూ.కోటి 16 లక్షల
నిల్వ నిధుల గుర్తింపు


