● పన్నెండు రోజులు నిర్వహణకు ఏర్పాట్లు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1 వరకు జరిగే సరస్వతీనది అంత్య పుష్కరాల్లో 12 రోజులపాటు తెప్పోత్సవం నిర్వహించడానికి దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కార్తీకపౌర్ణమి సందర్భంగా త్రివేణి సంగమం గోదావరిలో తెప్పోత్సవాన్ని కనులపండువగా నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో పుష్కరాల సమయంలో త్రివేణి సంగమంలో తెప్పోత్సవంలో ఉత్సవమూర్తులను ఆసీనులు చేసి విశేష పూజలతో ప్రతీ రోజు విహరించేలా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిసింది. అదే సమయంలో కాశీపండితులతో 12 రోజులపాటు హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. రెండు కార్యక్రమాలకు ఎలాంటి విఘాతం కలుగకుండా దేవాదాయ, రెవెన్యూ, ఇరిగేషన్, ఫిషరీస్, పోలీసుశాఖలు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
భద్రకాళి అమ్మవారిని
దర్శించుకున్న కేటీఆర్
హన్మకొండ కల్చరల్: భద్రకాళి అమ్మవారిని బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అంతకు ముందుగా ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, వేదపండితులు కేటీఆర్ను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్కు వేదపండితులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం కేటీఆర్ నేరుగా వరంగల్ హంటర్ రోడ్డులోని రైతు సభకు వెళ్లారు. ఆయన వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వొడితల సతీష్, మాజీ ఎంపీ మాలోతు కవిత ఉన్నారు.


