తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

గార్ల: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్‌ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిన సమయంలో ప్రభుత్వ మంచినీటి పథకం బావులను క్లోరినేషన్‌ చేసిన తర్వాత ప్రజలకు తాగునీటి సరఫరా చేయాలని సూచించారు. ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు వడదెబ్బకు గురికాకుండా ముందుస్తు జాగ్రత్త చర్యగా వారికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ఆయా గ్రామాల ఏఎన్‌ఎంలు సరఫరా చేయాలని ఆదేశించారు. ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా ఉదయం 10 గంటల లోపే ఉపాధి కూలీ లు పని ముగించుకొని ఇళ్లకు చేరుకోవాలన్నా రు. ఎంపీడీఓ మంగమ్మ, పీహెచ్‌సీ డాక్టర్‌ శివకుమార్‌, ఎంపీఓ శ్రీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

మెడికల్‌ కాలేజీకి అకాడమిక్‌ ఎక్సలెన్స్‌ అవార్డు

నెహ్రూసెంటర్‌: మానుకోట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి విశిష్ట గౌరవం దక్కింది. సెకండియర్‌ ఎంబీబీఎస్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, పాసింగ్‌శాతంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు మెడికల్‌ కాలేజీకి అకాడమిక్‌ ఎక్సలెన్స్‌ అవార్డు లభించింది. ఈమేరకు హైదరాబాద్‌లో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా కాలేజీ ప్రిన్సిపాల్‌ వెంకట్‌ లకావత్‌ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ను మంత్రి అభినందిస్తూ, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలని సూచించారు. అధ్యాపకులు, సిబ్బంది కృషితో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్‌ తెలిపారు. భవిష్యత్‌లో ఉత్తమ ప్రతిభను చాటేందుకు కృషి చేస్తామన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా జనగణన విధులు

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో జనగణన విధుల కేటాయింపులో కొంతమంది ఎంఈఓ లు నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో ని సంఘ కార్యాలయంలో బుధవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగణన డ్యూటీల కేటాయింపులో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రిసోర్స్‌పర్సన్‌ పేరుతో పాఠశాల విధులకు దూరమవుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

వార్షిక పరీక్షలు షురూ..

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమైనట్లు డీఈఓ వి.రాజేశ్వర్‌ తెలిపారు. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల 18వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 23న తల్లిదండ్రుల స మావేశం నిర్వహించి విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు అందజేయాలన్నారు. ఈ నెల 24 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయన్నారు. ఉపాధ్యాయులు పరీక్షలను సజావుగా నిర్వహించాలన్నారు.

‘అనధికార గర్భస్రావాలు చేస్తే కఠిన చర్యలు’

నెహ్రూసెంటర్‌: లింగ నిర్ధారణ, అనధికారిక గర్భస్రావాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ హెచ్చరించారు. గర్భధారణ పూర్వ, ప్రసవ పూర్వ రోగనిర్ధారణ పద్ధతులు, మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం నిబంధనలు, రికార్డుల నిర్వహణపై డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆడ శిశువు సంరక్షణ, లింగ నిర్ధారణ నిషేధం, గర్భస్థ శిశువు లింగ వివక్ష నివారణ, మహిళల ఆరోగ్య హక్కుల పరిరక్షణపై సమీక్షించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పూర్తిగా నిషేధమని, గర్భస్రావ సేవలు అర్హత కలిగిన వైద్యులతో, చట్టబద్ధత కలిగిన ప్రమాణాల ప్రకారమే నిర్వహించాలని సూచించారు. నిబ ంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. జీజీహెచ్‌ ఆర్‌ఎంఓ జగదీశ్వర్‌, ప్రోగ్రాం అధికారి సారంగం, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ నాగవాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement