● ధరలు తక్కువగా నిర్ణయించారని రైతుల ఆందోళన
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు బుధవారం అధిక మొత్తంలో మిర్చి రాగా.. ధరలు తగ్గిపోయాయి. ఈమేరకు రైతులు ఆందోళనకు దిగి మార్కెట్ సిబ్బందితో వాగ్వాదం చేసి రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మార్కెట్ సిబ్బంది రైతులకు లాట్ ఐడీలు కేటాయించిన తర్వాత వ్యాపారులు మిర్చి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ క్రమంలో ఎస్ఆర్ఆర్ సంస్థకు చెందిన వ్యాపారి మిర్చి కొనుగోళ్లు చేపట్టిన అనంతరం ధరలు నిర్ణయించే సమయంలో తక్కువగా వేశారని రైతులు ఆరోపించారు. కొంతమంది రైతులకు అధిక ధరలు నిర్ణయించగా.. మరి కొంతమందికి ధర తక్కువ నిర్ణయించి కొనుగోళ్ల లిస్టు ప్రకటించారని రైతులు ఆందోళన చేశారు. ఈమేరకు ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ సుజన్ బాబు రైతులతో మాట్లాడి మంచి ధరతో కొనుగోళ్లు చేపట్టే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


