హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు సమ్మెకు సన్నద్ధం కావాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సతీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్లోని పల్లా రవీందర్ రెడ్డి భవన్లో నిర్వహించిన ఆర్టిజన్, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల సమావేశంలో సతీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒకే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు వేర్వేరు సర్వీస్ రూల్స్ వర్తింపజేయడం సరికాదన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న వారికి ఒకే రకమైన సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలన్నారు. ఈ న్యాయమైన డిమాండ్ల సాధనకు దశల వారీగా ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 26, 30న అన్ని డివిజన్ కార్యాలయాల ఎదుట, ఏప్రిల్ 2న అన్ని సర్కిల్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదేనెల 7న ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్న నిర్వహించాలని, 8వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చంద్రారెడ్డి, కో–కన్వీనర్ చందర్ సింగ్, కోశాధికారి ప్రశాంత్, జాయింట్ సెక్రెటరీ వెంకన్న, ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్, ట్రాన్సో కో కన్వీనర్ వెంకటేష్, జేఏసీ నాయకులు రవీందర్, సృజన, భరత్, పాండు, సలీం పాషా, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సతీశ్ రెడ్డి


