● కలెక్టరేట్ ఎదుట ధర్నా
మహబూబాబాద్: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజ మౌళి, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి స్నేహబిందు డిమాండ్ చేశారు. సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ వ్యవస్థకు చట్టబద్ధత లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని ఎమ్మెల్యేలకు వినతులు ఇచ్చినా ఫలితం లేదన్నారు. చలో హైదరాబాద్కు పిలుపునివ్వగా అక్రమ అరెస్ట్లు చేశారన్నారు. కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. మే నెల మొత్తం సెలవులు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కుమ్మరికుంట్ల నాగన్న, దుర్గారావు, తిరుపతమ్మ, సులోచన, జ్యోతి, లలిత, ఉమా, సంధ్య, మల్లికాంబ పాల్గొన్నారు.


