వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ పబ్లిక్గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి నాలుగో ర్యాంకింగ్ చదరంగం పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఆక్యుపంక్చర్ డాక్టర్ ఎన్.సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. చదరంగంలో మేధో సంపత్తి పెంపొందుతుందని, తల్లిదండ్రులు పిల్లలను చెస్లో ప్రోత్సహించాలని ఆయన సూచించారు. చెస్ టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి.కన్నా మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా 66 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, ప్రేమ్సాగర్, పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సౌత్జోన్ పోటీలకు
కేయూ జట్టు
కేయూ క్యాంపస్: కొట్టాయంలోని ఎంజీ యూనివర్సిటీలో జరుగుతున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్బాల్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. ఎం.త్రివేణి, బి.కావ్య, జి.ఐశ్వర్య, బి.మీనాక్షి, బి.నందిని, డి.సాయిప్రసన్న, పి.శ్రీలత, బి.రాహేలు, కె. శిరీష, డి.పూజిత, మహేశ్వరి, బి.సౌమ్య, జి.వెన్నెల, బి.నాగజ్యోతి, డి.వైష్ణవి, యు.సంజన జట్టులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జట్టుకు హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ కె.మధుకర్ కోచ్ కం మేనేజర్గా వ్యవహరిస్తున్నారు.
ముస్త్యాలపల్లిలో
యువతుల అదృశ్యం
దామెర : ఇద్దరు యువతులు అదృశ్యమైన సంఘటన మండలంలోని ముస్యాలపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శాతరాశి శ్రీవాణి శనివారం సాయంత్రం 6 గంటలకు బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అలాగే, ఈనెల 20న సిలువేరు మిన్ను అదృశ్యమైంది. మిన్ను డీ ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా అనారోగ్యంతో మధ్యలోనే మానేసి ఇంటివద్దే ఉంటుంది. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో శ్రీవాణి తల్లి జయ, మిన్ను తండ్రి శంకర్ ఫిర్యాదుమేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 8712685228, 8712685020 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై సూచించారు.
పిడుగుపాటుకు
ఆవు మృత్యువాత
దేవరుప్పుల : మండలంలోని రామరాజుపల్లిలో పి డుగుపాటుకు శనివారం రాత్రి ఉప్పునూతుల నాగరాజుకు చెందిన పాడి ఆవు మృత్యువాత పడింది. ఆదివారం ఉదయం రోజువారీగా తన వ్యవసాయ పొలం వద్ద ఆవును చూసేందుకు వెళ్లగా పిడుగుపాటుకు మృత్యువాత పడి కనిపించింది. ఘటనా స్థలి ని పశువైద్య సిబ్బంది పరిశీలించారు. కాగా, పశువు మృత్యువాత పడడంతో సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని, రైతును ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు.


