ఆత్మకూరు: కారు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకా రం.. కాజీపేట సిద్దార్థనగర్కు చెందిన పర్రెపాటి రాకేశ్ (29) ఓ ఐటీఐ కళాశాలలో ఇన్స్ట్రక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున మిత్రులతో కలిసి తన కారులో ములుగు వైపునకు వెళ్తున్నాడు. మార్గమధ్యలోని కటాక్షపూర్ సమీపంలో ఓ టిప్పర్ను అజాగ్రత్తగా పార్క్ చేశారు. పైగా లైట్లు కూడా వేయలేదు. దీంతో చీకట్లో టిప్పర్ కనిపించకపోవడంతో వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో కారు నడుపుతున్న రాకేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ముందు కూర్చున్న పత్రి వంశీకృష్ణకి తీవ్ర, వెనుక కూర్చున్న గంధం నాగశ్రావణ్ స్వల్పగాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న క్షతగాత్రుడు వంశీకృష్ణను 108లో నగరంలోని ఓ ఆస్పతికి తరలించారు. మృతుడి తల్లి పర్రెపాటి వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోష్ తెలిపారు. కాగా, హైవే163పై వాహనాలు పార్క్ చేయకుండా సంబంధింత అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
యువకుడి మృతి..
మరొకరికి తీవ్రగాయాలు
కటాక్షపూర్ సమీపంలో ఘటన


