గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కోట ప్రవీణ్ కిడ్నీలు పాడైపోయి చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయం ‘ఆపన్న హస్తం అందించరూ’ అనే శీర్శికతో శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి పలువురు దాతలు స్పందించారు. ఆదివారం వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ప్రవీణ్ను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా చికిత్స నిమిత్తం రూ. 10 వేలు అందించినట్లు మాజీ ఎమ్మెల్యే పీఏ హరికృష్ణ తెలిపారు. అలాగే, 16వ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు సుంకరి శివ రూ. 3 వేలు, ఏనుమాముల మార్కెట్ మాజీ చెర్మన్ చింతం సదానందం రూ. 2 వేలు, గజ్జి రాజు రూ. 2 వేలతోపాటు పలువురు తమకు తోచిన సాయం అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.


