ఎస్పీని కలిసిన ఎస్సైలు
మహబూబాబాద్ రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శబరీష్ను పదోన్నతి పొందిన ఎస్సైలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఎస్సైలు షేక్.ఇమామ్, ఎల్.రవీందర్ సివిల్ ఎస్సైలుగా పదోన్నతి పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వారిని కేటాయించగా.. ఈమేరకు ఎస్పీ శబరీష్ అభినందించారు.
రైతులకు సరిపడా యూరియా ఉంది
డీఏఓ సరిత
కురవి: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు అఽధైర్యపడొద్దని డీఏఓ సరిత అన్నారు. సోమవారం సీరోలు మండలం కాంపల్లి సొసైటీలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రైతులకు యూరియా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవసరానికి అనుగుణంగా సకాలంలోయూరియా సరఫరా చేస్తామని తెలిపారు. అనవసరంగా యూరియాను నిల్వ చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో సీరోలు ఏఓ చాయారాజ్ పాల్గొన్నారు.
నర్సింగ్ కళాశాలలో
వసతులు కల్పించాలి
నెహ్రూసెంటర్: ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు భవనం, వసతులు కల్పించాలని నర్సింగ్ విద్యార్థులు అన్నారు. ప్రభుత్వ కళాశాల ఎదుట విద్యార్థులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. బిల్డింగ్ సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, నూతన బిల్డింగ్, హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 240మంది విద్యార్థులు ఉన్న కళాశాలలో సరిపడా తరగతి గదులు, ఇతర సౌకర్యాలు క ల్పించలేదన్నారు. అధికారులు, ప్రభుత్వం సౌకర్యాలు కల్పించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రేష్ట ప్రవేశ పరీక్షలో
ఆల్ఇండియా ర్యాంక్
మహబూబాబాద్ అర్బన్: ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రేష్ట ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రానికి చెందిన పట్ల స్రవంతి ఆల్ ఇండియా 46వ ర్యాంక్ సాధించింది. పట్ల కృష్ణవేణి–రవి దంపతు కుమారై స్రవంతి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కాగా ఆమె డిసెంబర్ 21న నిర్వహించిన శ్రేష్ట ప్రవేశ పరీక్ష రాయగా.. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. స్రవంతిని ఆమె తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, బంధుమిత్రులు అభింనదించారు.
టీసీసీ పరీక్షల హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
మహబూబాబాద్ అర్బన్: టెక్నికల్ కోర్సు సర్టిఫికెట్ (టీసీసీ) పరీక్షల హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ రాజేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 10నుంచి 13వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో డ్రాయింగ్ లోయర్, జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో డ్రాయింగ్ హయ్యర్, ఫాతిమా హైస్కూల్లో టైలరింగ్ ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ పేపర్–1, పేపర్–2 పరీక్షలు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ఆన్లైన్లో www.bse.telangana.gov.in అనే వెబ్సైట్లో హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఏసీజీఈ మందుల శ్రీరాములు 9849761012 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు.
ఎస్పీని కలిసిన ఎస్సైలు
ఎస్పీని కలిసిన ఎస్సైలు
ఎస్పీని కలిసిన ఎస్సైలు


