
రెనోవా బన్ను ఆస్పత్రి ప్రారంభం
● సామాన్యులకు అందుబాటులో
అత్యాధునిక క్యాన్సర్ చికిత్స
ఎంజీఎం : ప్రజలకు ప్రపంచ స్థాయి నాణ్యతతో క్యాన్సర్ చికిత్స అందించేందుకు రెనోవా బన్ను ఆస్పత్రిని ప్రారంబించినట్లు రెనోవా గ్రూపు ఆస్పత్రి ఫౌండర్ సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ములుగు రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిని సోమవారం ఆరోగ్యవర్సిటీ వీసీ నందకుమార్రెడ్డి, రిజిస్ట్రార్ నాగార్జునారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ ప్రాంతంలో తొలి సమగ్ర క్యాన్సర్ ఆస్పత్రిగా రెనోవా బన్ను ఆస్పత్రి నిలుస్తుందని తెలిపారు. ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలైన దాదాపు రూ. 20 కోట్ల విలువైన హెల్కాయిన్ ఇమేజ్ గైడెడ్ రేడియేషన్, దాదాపు రూ.6 కోట్ల విలువైన పెట్ సిటీ పరికరాలతో అంతర్జాతీయ స్థాయి చికిత్స సదుపాయాలు వరంగల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రభాకర్రావు, ఐఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు.
పలు రైల్వే స్టేషన్లలో హాల్టింగ్
కొనసాగింపు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్, వరంగల్ రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన తాత్కాలిక హాల్టింగ్లను కొనసాగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు.
హాల్టింగ్ స్టేషన్లు ఇవే..
దానాపూర్–సికింద్రాబాద్ (12792) దానాపూర్ ఎక్స్ప్రెస్కు జమ్మికుంట, నర్సాపూర్–నాగర్సోల్ (12787) ఎక్స్ప్రెస్కు మహబూబాబాద్, నాగర్సోల్–నర్సాపూర్ (12788) ఎక్స్ప్రెస్కు మహబూబాబాద్, పూణె–కాజీపేట (22151) ఎక్స్ప్రెస్కు మంచిర్యాల, కాజీపేట–పూణె (22152) ఎక్స్ప్రెస్కు మంచిర్యాల రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు.