
కులపెద్దలే పరిష్కరించాలి
కుటుంబ సమస్యలు
వరంగల్ లీగల్ : కుటుంబ సమస్యలు కులపెద్దలే పరిష్కరించాలని, సమాజంలో వ్యక్తులు, సమూహాల మధ్య వచ్చే వివాదాలను శాంతియుతంగా పరిష్కరించి, శాంతియుత సమాజాన్ని స్థాపించడానికి కమ్యూనిటీ పెద్దలు నడుం బిగించాలని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆయా జిల్లాల న్యా య సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం హనుమకొండలోని డీసీసీ బ్యాంక్ ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తా త్కాలిక చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ ఏ వివాదమైనా ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాల మధ్యే ఏర్పడుతుందని, అయితే ఆ వ్యక్తి గాని సమూహం గాని ఏదో ఒక కమ్యూనిటీకి చెందిన వారై ఉంటారన్నారు. అలాంటి పరిస్థితిల్లో అదే కమ్యూనిటీకి చెందిన పెద్దవారు వారికి నచ్చచెబుతే వివాదాలు సద్భావ వాతావరణంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ బృహత్తర ఆలోచన నుంచి ఉద్భవించినదే కమ్యూనిటీ మీడియేషన్ విధానమన్నారు. దేశంలో మొదటిసారి కేరళలో ఈ విధానం విజయవంతమైందని, సమాజంలోని కమ్యూనిటీ పెద్దలు కోర్టుల దాకా రాకుండా వేల సంఖ్యలో వివాదాలను పరిష్కరించారన్నారు. కాగా, 2023లో వచ్చిన మీడియేషన్ చట్టం ఈ విధానానికి చట్టబద్ధత కల్పించిందన్నారు. ముఖ్యంగా సమాజంలో కొన్నేళ్లుగా భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య తగాదాలు పెరిగిపోతున్నాయని, వీటికి చక్కటి పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ అని తెలిపారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, ఇంటిలో సర్ది చెప్పే పెద్దలు లేకపోవడం దంపతుల మధ్య మనస్పర్థలు ఎక్కువ అవ్వడానికి కారణమవుతున్నాయని, వీటిని సమాజ కమ్యూనిటీ పెద్దలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్. పంచాక్షరి మాట్లాడుతూ నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్లో ఇప్పటికే ఈ కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్లు విజయవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. గత ఏప్రిల్ 7న కామారెడ్డిలో ఒకేసారి 12 కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి నిర్మలా గీతాంబ, సి.హెచ్ రమేశ్ బాబు, ఇతర జిల్లాల న్యాయమూర్తులు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే, కమ్యూనిటీ మీడియేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని
కలిసిన వరంగల్, హనుమకొండ కలెక్టర్లు
హైకోర్టు తాత్కాలిక ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్
కమ్యూనిటీ మీడియేటర్ల శిక్షణ
కార్యక్రమం ప్రారంభం
కమ్యూనిటీ మీడియేటర్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభానికి జిల్లాకు వచ్చిన రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ను ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందించి స్వాగతం పలికారు.

కులపెద్దలే పరిష్కరించాలి