‘గూడూరు చరిత్ర’ నేటి తరానికి ఆదర్శం
పాలకుర్తి టౌన్: గూడూరు గ్రామ చరిత్రను పుస్తక రూపంలో తెలియజేయడం అభినందనీయమని, నేటి తరానికి ఆదర్శమని ప్రముఖ కవి డాక్టర్ లింగంపల్లి రామచంద్ర అన్నారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో చౌడవరపు విశ్వనాథం స్మారక గ్రంథాలయంలో శ్రీపోతన చైతన్య వేదిక ఆధ్వర్యంలో పాలడుగు రత్నాకర్రావు రచించిన ‘గూడూరు చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భగా రామచంద్రం మాట్లాడుతూ గూడూరు గ్రామ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు ‘గూడూరు చరిత్ర’ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నా రు. కాకతీయులు, శాతవాహనుల కాలం నుంచి నేటి వరకు గూడూరుకు ఘన చరిత్ర ఉందన్నారు. నిజాం కాలంలోనే తొలిసారి గోడ పత్రిక వెలువడిన గ్రామం గూడూరు అన్నారు. గూడూరులో ఎంతో మంది విద్యావేత్తలు, మేధావులు ఉన్నారని, వారి స్ఫూర్తితో ముందుకు సాగడం అభినందయనీయమన్నారు. మిగతా గ్రామాల చరిత్రలను కూడా పుస్తకం రూపంలో తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పోతన్న చైతన్య వేదిక అధ్యక్షుడు అనుముల ఎల్లయ్య, కవులు, రచయితలు డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్, యల్లంపట్ల నాగయ్య, చరిత్రపరిశోధకులు రెడ్డి రత్నాకర్రెడ్డి, రామోజు హరగోపాల్, కేవీజీకే ఆచార్యులు, ఆర్తి పరాంకుశం,ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్ కార్యదర్శి బొబ్బల రమణారెడ్డి, సొసైటీ చైర్మన్ బొబ్బల అశోక్రెడ్డి, మచర్ల పుల్లయ్య పాల్గొన్నారు.
ప్రముఖ కవి లింగంపల్లి రామచంద్ర


