పంటల బీమా
అందించేందుకు నివేదికలు
రికార్డుల్లో నన్ను చంపేశారు..
నా భార్యకు పింఛను ఇప్పించండి
● ఏటా వందల టీఎంసీల
వరద నీరు సముద్రం పాలవుతోందని
ఆందోళన
● రిజర్వాయర్ల నిర్మాణంతోనే
నీటి సమస్యకు పరిష్కారమని సూచన
● హుందాగా సాగిన
జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశం
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కేసీ కెనాల్కు 31.99 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. వీటిని పక్కనపెట్టి ఎలాంటి కేటాయింపులు లేని వెలిగొండకు ఇప్పటి వరకు 4.60 టీఎంసీల నీటిని ఎలా విడుదల చేస్తున్నారని చైర్మన్ పాపిరెడ్డి ప్రశ్నించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశం భవనంలో జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాయలసీమ రైతులను ఎండబెట్టి వెలిగొండకు నీటిని ఎలా తరలిస్తారని ఆయన అధికారులను నిలదీశారు. ఉమ్మడి జిల్లాలోని 77 చెరువులను హంద్రీనీవా నీటితో నింపితే భూగర్భ జలాలు రీచార్జ్ అవుతాయన్నారు. ఈ దిశగా అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలం నీటి మట్టం దిగువకు వస్తే చెరువులను ఎలా నింపుకోగలమన్నారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, చైర్మన్ పాపిరెడ్డి మధ్య కొద్ది సేపు చర్చ కొనసాగింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని చైర్మన్ గుర్తు చేశారు.
రిజర్వాయర్ల నిర్మాణంతోనే
నీటి సమస్యకు పరిష్కారం
ప్రతి ఏడాది సముద్రం పాలవుతున్న వందల టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రిజర్వాయర్లను నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని.. ఈ అంశాన్ని కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కో రిజర్వాయర్ 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించుకుంటే సూపర్ ఎల్నినో వంటి విపత్కర పరిస్థితుల్లో సాగు, తాగు నీటికి ఏర్పడే ఇబ్బందులను అధిగమించవచ్చన్నారు. 2020–21 నుంచి 2025–26 సంవత్సరం వరకు 8,100 టీఎంసీల వరద నీరు సముద్రం పాలైందని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. సమావేశంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు డాక్టర్ ఎ.సిరి, రాజకుమారి గణియా, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావుయాదవ్, జెడ్పీ సీఈఓ ఆర్.సుధాకర్రెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డితో ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీపీలు హాజరయ్యారు.
‘సుజల’ను ఉపయోగంలోకి తీసుకురండి
కర్నూలు జిల్లాలో ఆరు, నంద్యాల జిల్లాలోని రెండు ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకాలను వినియోగంలోకి తీసుకురావాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ మనోహర్ను కోరారు. కోడుమూరు మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరులోనే పది పదహైదు రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపయోగంగా ఉన్న ఎన్టీఆర్ సుజలను ఉపయోగంలోకి తీసుకురావాలని జెడ్పీటీసీ బి.రఘునాథరెడ్డి కోరారు.
ఎల్నినో నేపథ్యంలో రైతులకు పంటల బీమా పరిహారం అందించేందుకు నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనల ప్రకారం నివేదికలను ప్రభుత్వానికి పంపుతున్నాం. పశుగ్రాసం సాగుతో పాటు పంటల బీమా, పీఎండీఎస్ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వచ్చే ఏడాది జూలై వరకు వర్షాలు ఆలస్యమయ్యే అవకాశం ముంది. అందుబాటులోని నీటి వనరుల్లో తాగునీటి అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
– జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి
గత ఏడాది నష్టపోయిన పంటలకే నేటికీ ఇన్సూరెన్స్ అందలేదు.
– జెడ్పీటీసీలు యుగంధర్రెడ్డి, రంగనాథ్గౌడ్
ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. రైతులు, కూలీలు వలస పోకుండా ఉపాధి పనులు పెంచాలి.
– కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
నేను బతికే ఉన్నా. రికార్డుల్లో నేను చనిపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేశారు. ఈ కారణంగా నాలుగు విడతలుగా పీఎం కిసాన్ ఆర్థిక సాయం అందుకోలేకపోయాను. నాకు గూడూరు మండలం ఆర్.ఖానాపురం గ్రామంలో 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పత్తి, ఉల్లి, శనగ పంటలు సాగు చేస్తున్నా. ఎలాగూ నన్ను రికార్డుల్లో చంపేశారు. కనీసం నా భార్యకై నా వితంతు పింఛను ఇప్పించండి.
– సమావేశంలో కలెక్టర్ను వేడుకున్న
గూడూరు జెడ్పీటీసీ పి.మౌలాలి
తీర్మానాలు
కర్నూలు, నంద్యాల జిల్లాలను తీవ్ర
వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు
జిల్లాలుగా ప్రకటించాలి.
తీవ్ర ఎల్నినో పరిస్థితులు ఉన్నందున
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ
కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు
వెళ్లకుండా వీబీజీ రాంజీ పథకంలో
పని దినాలు పెంచాలి.
కౌలు రైతులందరికీ అన్నధాత సుఖీభవ
పథకాన్ని, పంటల బీమా పథకాన్ని
వర్తింపజేసి బ్యాంకులు రుణాలు
అందించాలి.
తాగునీటి అవసరాలకు ప్రభుత్వం ప్రత్యేక
నిధులు కేటాయించాలి.
శ్రీశైలం ప్రాజెక్టు, గోరుకల్లు తదితర
ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన
నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు
కల్పించాలి.
ఉమ్మడి జిల్లాలో సాగు, తాగు నీరు
అందించే గుండ్రేవుల ప్రాజెక్టును
త్వరితగతిన పూర్తి చేయాలి.


