ఎమ్మిగనూరు రూరల్: అదనపు కోర్టుల ఏర్పాటుతో పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి పి.వాసు అన్నారు. గురువారం పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ భవనం, కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయాలను జిల్లా జడ్జి పి.వాసు, స్థానిక మేజిస్ట్రేట్ పి.హేమ బార్ అసోసియేషన్ సభ్యులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి. వాసు మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు రూ.21 కోట్లు మంజూరు కాగా.. ఎమ్మిగనూరు కోర్టుతో పాటు అదనపు కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు రూ.2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి పాత తహసీల్దార్ కార్యాలయంలో ఒక కోర్టు భవనం, కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో మరో కోర్టును సిద్ధం చేశామన్నారు. రెండవ విడత కింద 11 కోర్టులను ప్రారంభిస్తామన్నారు. పది రోజుల్లో ఎమ్మిగనూరులో రెండు కోర్టులను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. వీరితో పాటు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ బి.లీలా వెంకటశేషాద్రి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి.రషీదుల్లా, జనరల్ సెక్రటరీ కె.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


