20న మెడికల్‌షాపుల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

20న మెడికల్‌షాపుల బంద్‌

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

కర్నూలు(హాస్పిటల్‌): మెడికల్‌షాపులను ఈ నెల 20న బంద్‌ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ కర్నూలు జిల్లా అధ్యక్షుడు యాడికి పుల్లయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ ఫార్మసీల నియంత్రణలేని కార్యకలాపాలు, అన్యాయ డిస్కౌంట్‌ విధానాలకు వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్‌ కాలానికి సంబంధించిన తాత్కాలిక నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని తెలిపారు. ఈ–ఫార్మసి సంబంధిత జీఎస్‌ఆర్‌ 817(ఇ) నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పేర్కొన్నారు. కార్పొరేట్‌ సంస్థల అన్యాయ భారీ డిస్కౌంట్లను అరికట్టేందుకు లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

నేడు డయల్‌ యువర్‌

సీఎండీ, ఎస్‌ఈ

కర్నూలు(అగ్రికల్చర్‌): ఏపీఎస్‌పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్‌ యువర్‌ ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ఆర్‌.ప్రదీప్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్‌ భవన్‌లో కూడా సోమవారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారు లు 7382614308 నంబరుకు ఫోన్‌చేసి సమ స్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌

కర్నూలు: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్‌ అధికారులు రౌడీషీటర్లకు నేర చరిత్ర ఉన్న వారిని, సమస్యాత్మక వ్యక్తులకు ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లాలో నాలుగు పోలీస్‌ సబ్‌డివిజన్లు, 39 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో దాదాపు 2 వేల మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లను ఆదివారం స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని హితబోధ చేశారు. అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి సెంట్రల్‌ జైలుకు పంపుతామని హెచ్చరించారు.

జాతీయ పోటీలకు ‘ౖసైసెరా’

కర్నూలు కల్చరల్‌: తిరుపతి అభినయ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో జూలైలో నిర్వహించనున్న జాతీయ స్థాయి నాటక పోటీలకు ‘ౖసైసెరా నరసింహారెడ్డి’ నాటకం ఎంపికై ంది. ఈ మేరకు అభినయ ఆర్ట్స్‌ అధ్యక్షుడు బీఎన్‌ రెడ్డి ప్రకటించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను నాటక రూపంలో పత్తి ఓబులయ్య దర్శకత్వంలో ప్రదర్శించనున్నారు. ఈ నాటకం నంది నాటక పోటీలలో పాల్గొని వెండి నందితో పాటు ఇతర నందులను కై వసం చేసుకుంది. గత నెలలో మిర్యాలగూడలో నిర్వహించిన జాతీయస్థాయి పద్య నాటక పోటీల్లో ద్వితీయ బహుమతిని పొందిందని పత్తి ఓబులయ్య తెలిపారు. ప్రస్తుతం అభినయ ఆర్ట్స్‌ పోటీలకు ఎంపిక కావడంపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.

ఆళ్లగడ్డలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఆళ్లగడ్డలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. నంద్యాల రూరల్‌, కోవెలకుంట్ల, ఉయ్యలవాడల్లో 42.5, చాగలమర్రిలో 42.4, పగిడ్యాల, జూపాడుబంగ్లా, సంజామలల్లో 42.3, మహనందిలో 42.2. కౌతాళంలో 41.5, చిప్పగిరి, గూడూరు, మద్దికెరల్లో 41.4, కర్నూలులో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న నాలుగైదు రోజుల్లో ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement