● ముగతి వద్ద ఆటో బోల్తా ● పెళ్లింట విషాదం
నందవరం: ముగతి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి నవ వరుడు బోయ మద్దిలేటి రంగడు (22) మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇవి.. దేవనకొండ మండలం కప్పట్రాళ్లకు చెందిన బోయ రంగడుకి, గోనెగండ్లకు చెందిని శ్రావణికి ఈ నెల 3వ తేదీన వైభవంగా పెళ్లి చేశారు. నూతన వధువరులు కావడంతో రథోత్సవం చూడాలని గురువారం ఆటోలో కుటుంబ సభ్యులతో మంత్రాలయానికి వెళ్లారు. రాఘవేంద్ర స్వామి దర్శిచుకుని శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో నందవరం మండలంలోని ముగతి గ్రామ సమీపంలోని 167వ జాతీయ రహదారిపై ఆటోకు కుక్కలు అడ్డం వచ్చాయి. వాటిని తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవవరుడు బోయ రంగడుకి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులందరూ (8మంది పెద్దలు, 4 చిన్నారులు) స్వల్ప గాయాలతో బయట పడ్డారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని అంబులెన్స్లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి బోయ రంగడిని తరలించారు. డాక్టర్లు పరీక్షించి బోయ రంగడు మృతి చెందినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లింట తీవ్ర విషాదఛాయాలు ఆలుముకున్నాయి. మృతిడి అన్న బోయ రమేష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిమ్మారెడ్డి కేసు నమోదు చేశారు.


