ఎనిమిది మృతి
సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, రైతులు
జూపాడుబంగ్లా/పాములపాడు: నీటికోసం వెళ్లిన 45 బర్రెలు బావిలో పడగా ఎనిమిది మృత్యువాతపడిన సంఘటన మండలంలోని 80 బన్నూరు గ్రామసమీపంలోని లక్ష్మీనగర్ వద్ద చోటుచేసుకుంది. బాధిత రైతులు తెలిపిన వివరాల మేరకు.. 80 బన్నూరు గ్రామానికి చెందిన పెద్దసామేలు, లక్ష్మమ్మ, ఈడిగ రమణ, శంకర్గౌడు, జక్కరయ్య, మనోహర్, హర్షపోగు శ్రీనివాసులు మరో వ్యక్తి బర్రెలను పోషించుకొంటూ జీవిస్తున్నారు. గురువారం ఉదయం బర్రెలను మేపుకునేందుకు గ్రామ సమీపంలోని పొలాల్లోకి తోలుకెళ్లారు. మధ్యా హ్నం సమయంలో వారు ఇళ్లవద్ద భోజనం చేసి వచ్చేందుకు వచ్చారు. అయితే ఎండల తీవ్రతతో దాహం కొన్న బర్రెలు నీటికోసం వెతుకుతూ సమీపంలోని కృష్ణారెడ్డి పొలంలో ఉన్న బావి వద్దకు వెళ్లాయి. బావిలోని నీటిని తాగేందుకు యత్నించిన బర్రెలు ఒక్కొక్కటిగా బావిలో పడిపోయాయి. బావిచుట్టూ కట్టడం లేకపోవటం, బావిలోంచి పైకి వచ్చేందుకు మార్గం లేక పోవటంతో బర్రెలు రాత్రంతా బావిలోనే ఈదుకొంటూ ఉన్నాయి. 8 బర్రెలు ఊపిరాడక మృత్యువాతపడినట్లు బర్రెల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లవద్ద భోజనం చేసి వెళ్లిన యజమానులకు బర్రెలు కనిపించకపోవటంతో వాటి కోసం చుట్టుపక్కల పొలాల్లో వెతకసాగారు. చివరికు శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఓ రైతు పొలంలోని బావిలో కనిపించాయి. అయితే వాటిని పైకి రప్పించేందుకు యత్నించిన యజమానులు మార్గం లేకపోవటంతో జేసీబీ సహాయంతో కొన్నింటిని బయటకు తీశారు. ప్రస్తుతానికి 8 మృత్యువాత పడ్డాయి. మరికొన్ని కనిపించకుండా పోయినట్లు రైతులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పాములపాడు ఎస్ఐ తిరుపాలు తన సిబ్బందితో సంఘటన స్థల చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లక్షల రూపాయల విలువైన పాడి పశువులు మృత్యువాత పడటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.


