● అధ్యక్షుడిగా చంద్రుడు, ప్రధాన కార్యదర్శిగా మహేశ్వర్ రెడ్డి
కర్నూలు: కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం జరిగిన న్యాయవాద సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా బి.చంద్రుడు, ప్రధాన కార్యదర్శిగా టి.మహేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడుగా బి.మద్దిలేటి, జాయింట్ సెక్రటరీగా జహంగీర్, క్రీడల కార్యదర్శిగా ప్రభాకర్ గెలుపొందారు. పోలింగ్లో 1059 మంది ఓటర్లకు గాను 905 మంది న్యాయవాదులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్ష స్థానం కోసం మురళీమోహన్, చంద్రుడు పోటీ పడగా 14 ఓట్ల మెజార్టీతో చంద్రుడు విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శి స్థానం కోసం మహేశ్వర రెడ్డి, నాగముని, నాగరాజు, సోమశంకర్, ఎం.వెంకటేశ్వర్లు పోటీ చేయగా మహేశ్వర రెడ్డికి 490 ఓట్లు, నాగమునికి 235, మిగతా వారికి 100 లోపే పోలయ్యాయి. 255 ఓట్ల మెజార్టీతో మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి జరిగిన పోటీలో మద్దిలేటి తన ప్రత్యర్ధి రసూల్ ఖాన్పై 135 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జాయింట్ సెక్రటరీ పదవికి జహంగీర్, సాయిప్రదీప్ పోటీ పడగా 30 ఓట్ల మెజార్టీ తో జహంగీర్ గెలిచారు. క్రీడల సాంస్కృతిక కార్యదర్శి పదవికి ప్రభాకర్, సుధాకర్, సురేంద్రగౌడ్, సుధీర్లు పోటీ పడగా 14 ఓట్లతో ప్రభాకర్ విజయం సాధించారు. కోశాధికారిగా సుమన రాణి, లైబ్రరీ కార్యదర్శిగా మహేష్ కుమార్, మహిళా ప్రతినిధిగా కరుణ జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు ప్రభాకర్రెడ్డి, అనిల్ కుమార్, రామకృష్ణా రెడ్డి, చక్రపాణి, ఇందుమతి తదితరులు కలసి విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించారు.


