ముందుగా డబ్బు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా
ప్రభుత్వ కార్యాలయాల్లో నేటి నుంచి అమలు
ఉమ్మడి జిల్లాలో 25,060ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్లు
ఇందులో 20,828 కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు
స్మార్ట్ మీటర్లు బిగించిన కనెక్షన్లకు ప్రీ పెయిడ్ విద్యుత్
ఉమ్మడి జిల్లాలో రూ.520.37 కోట్ల విద్యుత్ బకాయి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బకాయిలకు రూపాయి ఇవ్వని ప్రభుత్వం ఏకంగా స్మార్ట్ మిటర్లు బిగించి ప్రీపెయిండ్ విధానాన్ని తీసుకొస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులకు సంబంధించి రూ.520.37 కోట్ల బకాయిలు ఉండగా.. ఇప్పటి వరకు ఎలాంటి బడ్జెట్ కేటాయించని పరిస్థితి. గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులగొట్టాలని పిలుపునిచ్చారు. నేడు అదే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజల నడ్డివిరిచే దిశగా స్మార్ట్ మీటర్లకు శ్రీకారం చుడుతుండటం గమనార్హం. ముందుగా స్మార్ట్ మీటర్లు బిగించిన ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీ పెయిడ్ విద్యుత్ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రీ పెయిడ్ విద్యుత్ కోసం చెల్లించడానికి జిల్లాలోని ఏ ప్రభుత్వ కార్యాలయంలో రూపాయి కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఆయా శాఖల హెచ్వోడీలు రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నెల వారీగా ప్రీ పెయిడ్ విద్యుత్ కోసం విని యోగించాల్సి ఉంది. ఇందుకు అన్ని శాఖలకు ప్రభు త్వం నిధులు వెచ్చించాలి. అప్పుడే ప్రీ పెయిడ్ విద్యుత్ సాధ్యమవుతుంది. అయితే ఉమ్మడి జిల్లా లో 25,060 ప్రభుత్వ కనెక్షన్లు ఉన్నాయి. చంద్ర బాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యు త్ కనెక్షన్ల బకాయి రూ.520.37 కోట్లు ఉన్నాయి. 2024 జూన్ మాసం నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఈ బకాయిలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
20,828 స్మార్ట్ మీటర్లకు ప్రీ పెయిడ్ విద్యుత్
విద్యుత్ బిల్లుల చెల్లింపులకు రూపాయి ఇవ్వని ప్రభుత్వం సర్కారు కార్యాలయాలకు ప్రీ పెయిడ్ విద్యుత్ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెస్తోంది. కర్నూలు జిల్లాలో 10,643, నంద్యాల జిల్లాలో 10,188 ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్లు బిగించారు. ఉమ్మడి జిల్లాలో స్మార్ట్ మీటర్లు బిగించిన ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఇప్పటికే రూ.348.78 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తం చెల్లించకుండానే స్మార్ట్ మీటర్లకు ప్రీ పెయిడ్ విద్యుత్ విధానం అమలు చేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక ప్రీ పెయిడ్ విద్యుత్
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) సేవలు బుధవారం(ఏప్రిల్ ఒకటి) నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఏపీ నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం నాయకులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. త్వరలో ఆరోగ్య శ్రీ స్థానంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఇప్పటి వరకు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిపడ్డ రూ.3వేల కోట్లకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ప్రైవే టు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. జిల్లాలో 105 నెట్వర్క్ ఆసుపత్రు లు ఉండగా.. ఇందులో 60 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ఆయా ఆసుపత్రులు బకాయిల కోసం సమ్మె చేయడంతో రెండు నెలల క్రితం ప్రభుత్వం రూ.500కోట్ల వరకు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేయాల్సి వస్తోందని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి.
శ్రీమఠం హుండీ ఆదాయం రూ. 2.48 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.2,48,28,737 సమకూరింది. మంగళవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో మార్చి 10 నుంచి 30వ తేదీ వరకు 21 రోజుల హుండీ కానుకలు లెక్కించారు. నగదు రూపంలో రూ 2,39,26,137, నాణేలా రూపంలో రూ.9,02,600 వచ్చినట్లు మేనేజర్ శ్రీనివాసరావు వివరించారు. అలాగే 14 గ్రాముల బంగారం, 2,163 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్ కోనాపూర్ తెలిపారు.


