నంద్యాల(న్యూటౌన్): కార్పొరేట్ తరహా వసతులతో ఏర్పాటైన మోడల్ స్కూళ్లలో (ఆదర్శ పాఠశాలలు) ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ ఏడాది 2 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. జిల్లాలో 20 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. 6వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులు ఇంటర్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా ఈనెలాఖరు 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. విద్యార్థులు ఏపీ ఆన్లైన్ ద్వారా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు సమర్పించేందుకు www.cse.ap.gov.in, www.apms.apcfss.in వెబ్సైట్ను సంప్రదించాలి. ఆరో తరగతిలో ప్రవేశానికి గతేడాది మాదిరిగానే పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రశ్నాపత్రం 5వ తరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్ తరహాలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది.
దరఖాస్తు ఇలా..
దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు జిల్లాలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ కులాలకు చెందిన వారు 01–09– 2014 నుంచి 31–08–2016 మధ్య జన్మించి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ తెగల విద్యార్థులు అయితే 01–09–2012 నుంచి 31–08–2016 మధ్య పుట్టిన వారు అర్హులు.
మోడల్ స్కూళ్లలో సౌకర్యాలు..
● నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన
● ఆరో తరగతి నుంచి ఇంటర్మీడిమెట్ వరకు ఇంగ్లిష్ మీడియంలోనే బోధన
● విశాల తరగతి గదులు, సౌకర్యవంతమైన వాతావరణంలో ఉచిత విద్య
● నీట్, జేఈఈ, ఎంసెట్, ఎన్ఎంఎంఎస్, ఐఎంఓ, ఐఏప్వో లాంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ
● స్పోకెన్ ఇంగ్లిష్, హ్యాండ్ రైటింగ్పై ప్రత్యేక శ్రద్ధ, అన్ని సౌకర్యాలతో కూడిన గ్రంథాలయం, ఆధునిక పరికరాలతో కూడిన సైన్స్ ల్యాబ్లు
● ఎల్సీడీ ప్రొజెక్టర్ విద్యా బోధన
● ఇంటర్లో అందుబాటులో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు
● 9వ తరగతి నుంచి అకాడమిక్ విద్యకు సమాంతరంగా కనీసం రెండు ఒకేషనల్ కోర్సులు
6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్
విడుదల
ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తుల
స్వీకరణ
జిల్లాలో 20 ఆదర్శ పాఠశాలలు
ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష


