కనిపించిన నెలవంక
ప్రారంభమైన రంజాన్మాసం
నేటి నుంచి కఠోర ఉపవాసదీక్షలు చేపట్టనున్న ముస్లింలు
మసీదుల్లో మొదలైన
ఆధ్యాత్మిక శోభ
ఎమ్మిగనూరుటౌన్/గడివేముల/చాగలమర్రి: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. బుధవారం నెలవంక కనిపించడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గురువారం నుంచి ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. ఈ మాసంలోనే దివ్య ఖురాన్ అవతరించిందని ముస్లింల విశ్వాసం. ఖురాన్లోని 30 అధ్యయాలు ఈ మాసంలోనే పూర్తి చేస్తారు. దీనినే తరావీ నమాజ్ అంటారు. రంజాన్ మాసం ప్రారంభంతో కర్నూలు, నంద్యాల జిల్లాలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ మాసమంతా ముస్లింలు అధ్యాత్మికంగా గడుపుతారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు, దివ్య ఖురాన్ గ్రంథ పఠనంతో నిమగ్నమవుతారు. ఈనెల రోజులు ప్రతి దినంసూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. ఐదు పూటల నమాజ్ చేయడంతో పాటు తరావిహ్ ప్రత్యేక నమాజ్లు చేయడం దాన ధర్మాలు, ఉపవాస దీక్షలో ఉన్న వారికి సహెరీ, ఇఫ్తార్ విందులు ఇచ్చి దీక్షలు విరమింపజేయడం చేస్తుంటారు.
మూడు విధాలుగా ఉపవాస దీక్షలు:
రంజాన్ మాసాన్ని మూడు విధాలుగా వర్గీకరిస్తారు. ఇందులో మొదటి పది రోజులు దైవ కారుణ్యానికి ప్రతీక కాగా తర్వాతి పది రోజులు క్షమాభిక్షకు ప్రతీక. ఇక చివరి పది రోజులు నరకం నుంచి విముక్తి ఉపకరిస్తాయని దైవ ప్రవక్త మహమ్మద్ (సల్లలాహు ఆలైహి సల్లం) అభివర్ణించారు.
పుణ్య సాధన కోసం తరావీ
సామాన్యుడిని సైతం అల్లా పట్ల విశ్వాస పాత్రుడిగా, పవిత్రుడిగా మార్చే దివ్యమైనది రంజాన్ మాసం.ఇతర మాసాల కంటే ఎక్కువగా ప్రార్థనలు చేసుకునే అవకాశాన్ని అల్లాహ్ రంజాన్ మాసం రూపంలో ప్రసాదించాడు. ప్రతి ముస్లింకు తరావీ నమాజ్ పేరిట దివ్య గ్రంథాన్ని చదివే అదృష్టం కల్పించాడు.మిగతా మాసాలలో చేసిన ప్రార్థనలకంటే 70 రెట్లు అధిక పుణ్యం, అల్లా కృప లభిస్తుంది.తరావీ నమాజ్ను 27 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. అలా పూర్తి చేసిన రోజును షబ్బే ఖద్ర్గా భావించిదైవం పట్ల రెట్టింపు విశ్వాసంతో ఆరోజు నమాజ్ చేస్తారు. ఇందులో భాగంగా 20 రకాత్లు చదువుతారు. తరావీ నమాజ్ల ద్వారా పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని పూర్తిగా చదివిన పుణ్యం లభిస్తుంది.
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
● రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాసం దీక్షలు పాటిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం నీరు కూడా తీసుకోరు. ఈ ఎఫెక్ట్ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే షుగరు, బీపీ రోగులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇఫ్తార్ సమయంలో ఆహార పదార్థాలు పానీయాలపై నియంత్రణ ఉండాలి. తక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలే తీసుకోవాలి.
●ఇన్సూలిన్ ఉత్పత్తిని సరిదిద్దగలిగే షుగర్ ముందు మెట్ఫోర్మిన్ వాడుతున్న వారు ఇఫ్తార్ సమయంలో మాత్రల మోతాదులను వైద్యుల సలహాతో తీసుకోవాలి.
● పాంక్రియస్ గ్రంధి నుంచి ఇన్సూలిన్ విడుదలకు దోహద పడే గ్లిజెస్కమైడ్ మందులు వాడుతున్న వారు వైద్యుడి సలహాతో స్పల్ప వ్యవధికి పనిచేసే గ్లిపిజైడ్ రేపగ్జినైడ్ వాడవచ్చు. డయాబైటీస్ ఉన్న వారు ఉపవాసం ఉండకపోవడమే మంచిది. అన్నం, చపాతీలు, నాన్, పప్పు, పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోవాలి
● సహెరీ భోజనం మరీ అర్ధరాత్రి కాకుండా సూర్యోదయానికి ముందు తీసుకోవాలి. ఇది ఉప వాస సమయంలో సమాంతర శక్తి పొందడానికి, రక్తంలో చెక్కర స్థాయి స్థిరంగా ఉంచడానికి ఉపయోగ పడుతుంది.
ఆధ్యాత్మిక సాధనకు తస్బీ
అధ్యాత్మిక మాసమైన రంజాన్ నెల మొత్తం ముస్లింలు అధ్యాత్మిక చింతనతోనే గడుపుతారు.మనిషిని మంచివాడిగా మార్చేందుకు ఈ మాసం మంచి అవకాశం కల్పిస్తుంది. దైవ నామస్మరణలో ‘తస్బీ’ ప్రధాన పాత్ర వహిస్తుంది.ఈ మాసంలో ఖురాన్ పఠనం చేసే వారితో పాటు మౌనంగా దైవ నామస్మరణ చేసే వారు ఎక్కువగా తస్బీని ఉపయోగిస్తుంటారు.తస్బీ పూసలు 33 మార్లు సుభాహన్ అల్లాహు, 33 మార్లు అల్హమ్దులిల్లాహ్, 34 మర్లు అల్లాహుఅక్బర్ అని ఉచ్చరిస్తూ మనసులో చదువుకోవాలి.
కనిపించిన నెలవంక
కనిపించిన నెలవంక


