పాత కక్షలతో కొట్టి చంపారు
● అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు
వెల్దుర్తి: అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలను మనసులో పెట్టుకునే మదార్పురం వద్ద సురేశ్ను హత్య చేసినట్లు విచారణలో తేలింది. అతని వెంట తిరిగే వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. వెల్దుర్తి సీఐ యుగంధర్, ఎస్ఐ నరేశ్ బుధవారం నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు. డోన్కు చెందిన ఫైబర్నెట్లో పనిచేసే గొల్ల సురేశ్, కోళ్ల ఫారంలో పనిచేసే అల్లాబకాష్, ప్రైవేట్ డ్రైవర్గా పనిచేసే అమ్రేష్ నాయక్లు కలిసి తిరుగుతుంటారు. ఒక పంచాయతీలో తన సోదరుడు క్షమాపణలు చెబుతుంటే సురేశ్ ఎగతాళిగా నవ్వాడని అల్లాబకష్, అలాగే తన భార్యతో అనుచి తంగా ప్రవర్తించాడని అమ్రేష్ నాయక్ సురేశ్పై కక్ష పెంచుకున్నారు. ఈనెల 11వ తేదీ రాత్రి మదార్పురం సమీపంలోని కోళ్ల ఫారం వద్ద ముగ్గురు కలిసి మద్యం తాగారు. సురేష్ మత్తులో జారుకున్న తర్వాత కట్టె, కొడవలి, రాడ్డు,రాయి తదితర వాటితో విచక్షణా రహితంగా దాడి చేసి చంపారు. మృతదేహాన్ని అక్కడి నుంచి మాయం చేయాలని చూశారు. చేతకాక రాత్రంతా అక్కడే ఉండి 12వ తేదీ ఉదయం నిందితులే 108కు ఫోన్ చేసి సురేశ్ మద్యం తాగి పడిపోయాడని నాటకమాడారు. తర్వాత స్థానిక పోలీస్స్టేషన్ వెళ్లి చనిపోయినట్లు సమాచారమిచ్చారు. సీఐ, ఎస్ఐలు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడి తల్లి ఎల్లవేణమ్మ ఫిర్యాదు మేరకు అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృతదేహా న్ని పోస్టుమార్టంకు తరలించారు. విచారణలో భాగంగా కోళ్లఫారంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా పై నిందితులు కొట్టి చంపినట్లు బయటపడింది. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కూడా ఇదే విషయం తేలడంతో నిఘా ఉంచిన పోలీసులకు అల్లాబకాష్, అమ్రేష్నాయక్ బుధవారం కోళ్లఫారం వద్ద పట్టుబడ్డారు. నిందితులు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకొని డోన్ కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.


