ఓటరు మ్యాపింగ్లో జిల్లాకు 14వ స్థానం
● మ్యాపింగ్ చేయని ఇద్దరు
బీఎల్ఓల సస్పెన్షన్
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో ఓటరు మ్యాపింగ్ 47.90 శాతం ఉందని, రాష్ట్రంలో కర్నూలు జిల్లా 14వ స్థానంలో నిలిచిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జనవరి చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 85 శాతం మ్యాపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియను సరిగా చేపట్టని ఇద్దరు బీఎల్ఓలను సస్పెండ్ చేశామన్నారు. మున్ముందు బీఎల్ఓలు నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెట్లను(బీఎల్ఏ) వెంటనే నియమించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో కలెక్టరేట్లో ఉన్న ఈవీఎం గోదామును శనివార త్రైమాసిక తనిఖీ చేపట్టారు. పటిష్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల పనితీరుపై నిరంతరం నిఘా ఉంచాలని అక్కడి అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్లోని తన చాంబరులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పులు లేని ఓటరు జాబితాలో రూపకల్పన బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మురళీ పాల్గొన్నారు.


