
స్కూల్ బ్యాగులు చిరిగి.. నాణ్యత నవ్వి!
నాణ్యమైన బ్యాగ్లు ఇచ్చేందుకు చర్యలు
● జిల్లాలో 2.68 లక్షల మందికి స్కూల్ బ్యాగుల పంపిణీ ● చిరిగిన బ్యాగ్లు వెనక్కి ఇస్తే కొత్తవి ఇస్తామని ప్రకటన ● కుట్లు పోయింటే కుట్టించుకుని వాడుకోవాలంటున్న అధికారులు
కర్నూలు సిటీ: ‘సర్వేపల్లి రాధా కృష్ణ విద్యార్థిమిత్ర’ బ్యాగుల పరిస్థితి జిల్లాలో దారుణంగా ఉంది. చిరిగిపోయిన బ్యాగు లు గుట్టలుగా పడి ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు స్కూల్ బ్యాగులను అత్యంత నాణ్యత కలిగినవి అందిస్తున్నామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. అయితే విద్యా సంవత్సరం మొదల య్యాక కొంత ఆలస్యంగా విద్యార్థులకు బ్యాగులను అందించారు. నెల రోజుల్లోపే వాటిలో 60 శాతంపైనే చిరిగిపోయాయి. విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. చిరిగిన, కుట్లు పోయిన వాటిని రిటర్న్ పంపించాలని, వాటి స్థానంలో కొత్తవి ఇస్తామని ఇటీవలే ఆయా స్కూళ్ల హెచ్ఎంలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో చాలా మంది హెచ్ఎంలు యాప్లో బ్యాగ్లను రిటర్న్ చేసేందుకు వివరాలు నమోదు చేశారు. అయితే ఇందులో బ్యాగ్ మొత్తం పనికిరాకుండా ఉంటేనే వెనక్కి తీసుకుని కొత్తది ఇస్తామని విద్యాశాఖ అధికారులు మెలిక పెట్టారు.
చిరిగితే కుట్టించుకోండి!
జిల్లాలోని 1,457 ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లు ఉండగా 2,76,971 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు 2.68 లక్షలు అందజేశారు. ఒక్కో కిట్టు విలువ రూ.2,279 కాగా వీటిలో స్కూల్ బ్యాగు ఉంది. చిరిగిపోయిన స్కూల్ బ్యాగ్ రిటర్న్ ఇవ్వాలని విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలో రెండు రోజులకే 1,174 మంది పిల్లలు రిటర్న్ చేసేందుకు యాప్లో అప్లోడ్ చేశారు. అయితే 252 మందికి మాత్రమే కొత్త బ్యాగ్లు ఇవ్వనున్నారు. మిగిలిన బ్యాగ్లను ఆయా స్కూళ్లకు వెనక్కి పంపించి కుట్లు పోయింటే, చిరిగిపోయింటే కుట్లు వేయించుకోండి అని విద్యాశాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం.
కొలతలు లేకుండానే బూట్లు..
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో 2,71,006 మంది విద్యార్థులకు బూట్లు, ఒక్కో విద్యార్థికి రెండు జతల సాక్సులు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందజేయలేదు. కొందరికి ఇచ్చినా ఎలాంటి ముందస్తు కొలతలు తీయకుండానే విద్యార్థులకు అందజేశారు. దీంతో చాలా మంది విద్యార్థులు బూట్లు వేసుకోకుండానే చెప్పులు వేసుకోని స్కూళ్లకు వస్తున్నారు. చిప్పగిరి, కృష్ణగిరి, వెల్దుర్తి, ఎమ్మిగనూరు మండలాల్లో సుమారుగా 500 మంది విద్యార్థులకు ఇంత వరకు స్కూల్ బ్యాగ్లు ఇవ్వలేదని ఉపాధ్యాయ వర్గాలే చెబుతున్నాయి. ఆయా మండలాల పరిధిలోని స్కూళ్ల నుంచి చిరిగిన బ్యాగ్లు, కుట్లుపోయిన బ్యాగ్లను సేకరించి జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టోరేజీ పాయింట్కు చేర్చాలని సమగ్ర శిక్ష అధికారులు ఎంఈఓలకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 26 మండలాలు ఉంటే కేవలం నాలుగు మండలాల నుంచి మాత్రమే బ్యాగ్లు మార్పులు చేసేందుకు యాప్లో అప్లోడ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ నాలుగు మండలాల్లో కూడా కొన్ని స్కూళ్ల నుంచి మాత్రమే కొత్త బ్యాగ్లు కోరినట్లు తెలుస్తోంది.
డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు, బూట్లు అందజేశాం. బ్యాగ్లో కొన్ని డ్యామేజ్ వచ్చినవి, చినిగిపోయి వినియోగించేందుకు ఉపయోగంగా లేని వాటిని మార్చి నాణ్యమైన బ్యాగ్లను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా కొలతలు సరిపోని బూట్లను సైతం మార్పులు చేసి కొత్తవి ఇవ్వనున్నాం. – ఎస్.శ్యామూల్ పాల్, డీఈఓ

స్కూల్ బ్యాగులు చిరిగి.. నాణ్యత నవ్వి!

స్కూల్ బ్యాగులు చిరిగి.. నాణ్యత నవ్వి!