ఎస్పీ విద్యాసాగర్నాయుడు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యలను చట్ట పరిధిలో పూర్తి విచారణ జరిపి పరిష్కారం అందించే లక్ష్యంతో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీకోసం కార్యక్రమానికి 42 అర్జీలు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వారి సమస్యలకు సంబంధించి ఫిర్యాదులను అర్జీల రూపంలో ఎస్పీకి నేరుగా అందజేయగా, వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్య తీవ్రత ఆధారంగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారికి ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
అవనిగడ్డకు చెందిన రమ్య తన భర్త మద్యానికి బానిసై నానా చిత్రహింసలు పెడుతుండటంతో, గడిచిన ఆరు నెలల కాలంగా వేరుగా జీవిస్తున్నామని, అయినా తన ప్రవర్తనలో మార్పు రాకపోగా మానసిక చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, న్యాయం చేయమని కోరుతూ అర్జీ అందజేసింది.
పామర్రుకు చెందిన ప్రమీలా తనకు వివాహం జరిగి రెండేళ్లు అవుతోందని, అదనపు కట్నం కోసం తన భర్త అత్తింటి వారు తీవ్రంగా వేధిస్తున్నారని న్యాయం చేయమని అర్జీలో వేడుకుంది.
చల్లపల్లికి చెందిన గంగాధరరావు అనే వృద్ధుడు తనకు ఇద్దరు సంతానం ఉండగా తన భార్య ఇటీవల మరణించిందని, అప్పటి నుంచి తన పిల్లలు తన యోగక్షేమాలు చూడకపోగా ఆస్తి మొత్తం తమ పేర రాయాలని వేధింపులకు గురి చేస్తున్నారని న్యాయం చేయమని అర్జీ ఇచ్చారు.


