భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రాభివృద్ధిలో కార్మికులు, యాజమాన్యం రెండు కళ్లులా భావిస్తూ సమతుల్యంగా ముందుకు సాగుతున్నామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన శ్రమ శక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్మికుల సంక్షేమం, భద్రత, ఉపాధి, ఆరోగ్యానికి అత్యంత ప్రాధానం ఇస్తున్నామని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లేబర్ అడ్డాస్ ఏర్పాటు చేసి ఉపాధి, విశ్రాంతి, వాష్ రూమ్స్, భోజనం, శిక్షణ సదుపాయాలను కల్పిస్తున్నామని వివరించారు. కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఇన్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కార్యదర్శి ఎం.వి.శేషగిరి బాబు మాట్లాడుతూ.. సాఫ్ట్వేర్ పరంగా లేబర్ కోడ్స్ ద్వారా కార్మికులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు కార్మిక శాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ – శ్రమ్ బీఓసీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలను మరింత విస్తృతం చేయడానికి చర్యలు తీసుకుటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డ్ చైర్మన్ వి.మల్లికార్జునరావు (బాబ్జి), ఎన్జీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాచర్ల కేసీపీ సిమెంట్ ఐఎన్టీయూసీ యూనియన్ జనరల్ సెక్రటరీ జి.లక్ష్మీనారాయణ శ్రమ శక్తి అవార్డ్ అందుకున్నారు.
కార్మిక శాఖ మంత్రి
వాసంశెట్టి సుభాష్


